అమరావతి : బీసీలను పిలిచి అడ్రస్ లేని పవన్

Vijaya




పార్టీ ఆఫీసుకు రమ్మన్నారు. బీసీల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆహ్వానాలు పంపారు. బీసీల సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాంతో తమ సమస్యలు చెప్పుకుందామని బీసీల నేతలు కొందరు జనసేన ఆఫీసుకు వచ్చారు. సమావేశం మొదలైంది కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అడ్రస్ లేరు. సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పి, సంక్షేమంపై మాట్లాడుకుందామని రమ్మని పిలిచిన తర్వాత పవన్ ఎందుకు హాజరుకాలేదు ?



ఇపుడిడే అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. జనసేన ఆఫీసులో సమావేశం అంటే అందులోను పవన్ దగ్గర నుండి ఆహ్వానాలు వచ్చాయంటే ఎవరైనా సమావేశంలో పవన్ పాల్గొంటారనే అనుకుంటారు. కానీ సమావేశానికి వచ్చింది మాత్రం సెకండ్ లెఫ్ట్ నెంట్ నాదెండ్ల మనోహర్ మాత్రమే. పవన్ కోసం వేసిన కుర్చీ మాత్రం ఖాళీగానే ఉంచేశారు. బీసీ నేతలు ముఖ్యంగా వాల్మీకి బోయ సామాజికవర్గం నుండి వచ్చిన కొందరు నేతలు చెప్పిన సమస్యలను, కష్టాలను నాదెండ్ల నోట్ చేసుకున్నారంతే.



సమావేశానికి పిలిచి మరి పవన్ ఎందుకు గైర్హాజరైనట్లు ? పార్టీ ఆఫీసులో పవన్ తో సమావేశం అంటే బీసీ నేతలు వచ్చారు కానీ నాదెండ్లతో అంటే వచ్చేవారేనా ? పవన్ తో సమస్యలు చెప్పుకుంటే అదో తృప్తికాని నాదెండ్లతో చెప్పుకుంటే ఏమొస్తుంది ? మొత్తంమీద సమావేశానికి హాజరైన బీసీనేతల్లో ఇదే విషయమై తీవ్ర అసంతృప్తి కనబడింది.



ఒకవైపు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మరోవైపు జనసేన కెపాసిటి ఏమిటో పవన్ కే తెలీదు. ఇదే సమయంలో కాపు సామాజికవర్గమైనా పవన్ను ఓన్ చేసుకుంటోందా అంటే అదీలేదు. ఈ నేపధ్యంలో తాను అందరివాడినని జనాలతో అనిపించుకోవాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరలాంటపుడు బీసీలతో సమావేశమంటే పవన్ ఉండితీరాల్సిందే కదా. అసలే చాలా ప్రాంతాల్లో బీసీలకు, కాపులకు ఏమాత్రం పడదు. ముఖ్యంగా పవన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో బీసీలు, కాపులకు ఏ విషయంలోను పడదు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడపలో వాల్మీకి, బోయలు ఎక్కువ. మరిలా సమావేశానికి పిలిచి అవమానిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: