మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెనుక భారీ కుట్ర... ఎమ్మెల్యే సీటు కష్టమే ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలు హోరా హోరీగా ఉండనున్నాయి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ మీద ఉన్న అసహనం మరియు వ్యతిరేకత వైసిపికి బాగా కలిసి వచ్చి 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాకు ఇదే చివరి ఎన్నిక నన్ను గెలిపించండి అంటూ ప్రజల చుట్టూ తిరుగుతున్నాడు. మరో వైపు వైసీపీ సంక్షేమం బాగా చేశాము మరోసారి మాకు అవకాశం ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మరి ఈ రెండు పార్టీలలో ఎవరి విన్నపం ప్రజలను మెప్పిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే వరుసగా రెండు సార్లు ఎమ్మేల్యే గా గెలిచి వైసీపీ కోసం ఎంతో శ్రమించిన లీడర్ గా పేరు తెచ్చుకున్న నెల్లూరు నగర ఎమ్మెల్యే మరియు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదు అని చెప్పాలి. అనిల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అందరూ తనతో ఉన్నారు... బాగా లబ్దిని పొందారు. అయితే రెండవసారి మంత్రి వర్గ కూర్పులో అనిల్ కుమార్ కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో అప్పుడు తన చుట్టూ ఎటువంటి వారు ఉన్నారన్న విషయం అనిల్ తెలుసుకున్నారు. సొంత బాబాయి మరియు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. అనిల్ తో విబేధాలు పెట్టుకుని తన వర్గాన్ని తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు.
అలా వెళ్లిపోయిన రూప్ కుమార్ యాదవ్ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మరియు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లతో కలిసి వచ్చే ఎన్నికల్లో అనిల్ కు సీటును దక్కకుండా చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నెల్లూరు రాజకీయ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం నెల్లూరు నగర ఎమ్మెల్యే గా 2024 లో పోటీ చేసే నాయకుడు అనిల్.కుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా కాదని చెబుతున్నారు. అయితే ఈ స్థానానికి ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.. వారిలో ముక్కాల ద్వారకానాథ్ ఒకరు, ప్రస్తుతం నెల్లూర్ ఎంపీ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్. కానీ రూప్ కుమార్ యాదవ్ మరియు నెల్లూర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కూడా ముక్కాల ద్వారకానాధ్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరి ముందు ముందు ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: