అమరావతి : చంద్రబాబుకు ‘స్లోగనే’ రివర్సు కొడుతోందా ?
మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చేసరికి ప్రత్యర్ధులు భయపడేవారు. అలాగే వచ్చిన వార్తలు, కథనాలన్నీ నిజమే అని జనాలు కూడా అనుకునేవారు. ఈ విధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. అయితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి ముందు పనికిరాకుండా పోయాయి. 2014 తర్వాత చంద్రబాబు ప్లాన్లన్నీ బెడిసికొట్టడంతో 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నారు. ఇదంతా చరిత్రయితే ఇపుడు జగన్ను ఓడించేందుకు కొత్తగా ‘సైకో పాలన పోవాలి..సైకిల్ పాలన రావాలి’ అనే స్లోగన్ను అందుకున్నారు.
అయితే ఈ స్లోగన్ జనాల్లో పెద్దగా పనిచేయటం లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే జగన్ను సైకోలాగ చంద్రబాబు, పవన్ కల్యాణ్ అండ్ కో తో పాటు ఎల్లోమీడియా మాత్రమే చూస్తోంది. మామూలు జనాల్లో మెజారిటి హ్యాపీగానే ఉన్నట్లున్నారు. ఎందుకంటే దాదాపు 1.31 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏదోరూపంలో లబ్ది అందుతోంది. ఇందులో వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు కూడా ఉన్నారు. జనాలు అనుకున్నారు కాబట్టే సైకిల్ పాలన పోయింది.
ప్రభుత్వం నుండి లబ్దిపొందుతున్న జనాలకు జగన్ పాలన సైకోపాలనగా అనిపించే అవకాశంలేదు. పైగా చంద్రబాబు హయాంలో మధ్య తరగతితో పాటు బీపీఎల్ ఫ్యామిలీలు కూడా బాగా ఇబ్బందులు పడ్డాయి. మౌళిక సదుపాయాలను కల్పించలేకపోయారు. అభివృద్ధి లేకపోగా సంక్షేమపథకాలను అటకెక్కించేశారు. అమరావతి గ్రాఫిక్స్ కారణంగా చంద్రబాబు పాలనంతా సంపన్నుల కోసమే అన్నట్లుగా జనాలకు అర్ధమైంది. అందుకనే 2019 ఎన్నికల్లో టీడీపీ అంత ఘోరంగా ఓడిపోయింది. అలాంటిది మళ్ళీ సైకిల్ రావాలని టీడీపీ జనాలు తప్ప న్యూట్రల్స్ లో ఎంతమంది కోరుకుంటారు ? చూస్తుంటే చంద్రబాబు చేస్తున్న స్లోగన్ చివరకు చంద్రబాబుకే రివర్సు కొట్టేట్లుంది.