రాయలసీమ : 11 మందిని పోలీసులే హత్యచేశారా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు రెండు సభల్లో  టీడీపీ  నిర్వహణ లోపంవల్లే రెండు సందర్భాల్లో 11 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగురోజుల వ్యవధిలో  కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట వల్ల 11 మంది చనిపోయన విషయం సంచలనమైంది. అన్నీవైపుల నుండి తనపై జరిగిన దాడితో మొదట్లో చంద్రబాబు బిత్తరపోయారు. కందుకూరులో 8 మంది చనిపోయిన ఘటన పెద్ద షాక్ కొట్టింది.



మూడురోజల తర్వాత మళ్ళీ గుంటూరు సభలో మరో ముగ్గురు చనిపోతే ఘటనపై  చంద్రబాబు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది కుప్పం పర్యటనలో మాట్లాడుతు కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో 11 మంది చనిపోవటానికి పోలీసులే బాధ్యులని ఆరోపించారు. పోలీసులే కుట్రచేసి 11 మందిని హత్యచేసినట్లు ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. అనుమతి తీసుకున్న ఎన్టీయార్ సర్కిల్లో కాకుండా ఇప్పగుంట సర్కిల్ ఇరుకురోడ్డులో సభ పెట్టుకుని తొక్కిసలాట జరగటానికి పోలీసులు ఏ విధంగా కారణమో చంద్రబాబే చెప్పాలి. తప్పులన్నీ తమవైపే ఉన్నా ప్రత్యర్ధులపైకి నెట్టేయటం చంద్రబాబుకు మొదటినుండి ఉన్న అలవాటే.



అలాగే గుంటూరులో 10 వేలమంది కూడా పట్టని ఓల్డ్ వికాస్ కాంపౌండ్లో సభ పెట్టుకుని 30 వేలమందిని ఎందుకు రప్పించారో చంద్రబాబే సమాధానం చెప్పాలి. తన సభలంటే జనాలు రారనే అనుమానంతో సంక్రాంతి కానుకలని, జనతా వస్త్రాలని పేదలకు ఆశచూపించి జనసమీకరణ చేయటం చంద్రబాబుకు తప్పనిపించలేదు. పైగా ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ రు. 5 కోట్లతో కానుకులు పంచితే కేసుపెట్టి అరెస్టు చేస్తారా అంటు పోలీసులను ఎదురుప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.



కందుకూరులో తొక్కిసలాట జరగటానికి కారకులైన నిర్వాహకులను అరెస్టు చేయటాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టారు. అంటే సభలకు సరైన ఏర్పాట్లు చేయకపోయినా, తొక్కిసలాటల్లో ఎంతమంది చనిపోయినా అడగకూడదన్నట్లుగా ఉంది చంద్రబాబు వైఖరి. తొక్కిసలాట మరణాల్లో  పార్టీ వైఫల్యం లేకపోతే మరి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఎందుకు ప్రకటించారో చంద్రబాబు సమాధానం చెప్పగలరా ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: