కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.25 లక్షల రుణం..
ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఉద్యోగులు కొత్త ఇంటి నిర్మాణం, ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొనడం, ఇప్పటికే ఉంటున్న ఇంటిని విస్తరించడం, సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనడం, హౌజింగ్ బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీలు, రిజిస్టర్డ్ బిల్డర్ల నుంచి ఫ్లాట్స్ కొనుగోలు చేయడం కోసం అడ్వాన్స్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలతో పోలిస్తే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు తక్కువ. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకుంటే 7.1 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు.
హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ 2017 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 నెలల బేసిక్ వేతనాన్ని అడ్వాన్స్గా తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఒకవేళ కొనాలనుకున్న ఇల్లు, ఫ్లాట్ విలువ రూ.25 లక్షల లోపు ఉన్నట్టైతే వాటి విలువ ఎంత ఉంటే అంత రుణం వస్తుంది.ఇక ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించాలనుకుంటే 34 నెలల బేసిక్ వేతనాన్ని అడ్వాన్స్గా తీసుకోవచ్చు. కానీ గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం, ఇంటి విస్తరణ చేయాలనుకుంటే నిజమైన వ్యయంలో 80 శాతం వరకే అడ్వాన్స్ లభిస్తుంది..ఇప్పటికే రుణాలను తీసుకున్న వారికి ఈ వడ్డీ రేట్లను కూడా మార్చాలని ప్రభుత్వం తెలిపింది.