ఢిల్లీ : బీజేపీ చాలా ఓవర్ చేస్తోందా ?

Vijaya





బీజేపీ దెబ్బకు జాతీయస్ధాయిలో కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడిపోతోంది. తాజాగా గోవాలో కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి ఫిరాయించారు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 11 మంది ఎంఎల్ఏలు గెలిచారు. వీరిలో 8 మంది కమలం కండువా కప్పుకోవటంతో కాంగ్రెస్ పార్టీ గోల గోల చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రకు జనాలు బ్రహ్మాండంగా విజయవంతం అవటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందంటు జాతీయ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్ మండిపడ్డారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. ఇండియాలో నుండి కాంగ్రెస్ పార్టీని తరిమేయటం అంటే బీజేపీ ఉద్దేశ్యం కాంగ్రెస్ కు చెందిన ఎంఎల్ఏలు, ఎంపీలను లాగేసుకోవటమేనేమో. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఏదో పద్దతిలో లాగేసుకోవటమే ప్రధాన టార్గెట్ గా బీజేపీ పెట్టుకున్నది. మిగిలిన పార్టీల ఎంఎల్ఏలను కూడా లాగేసుకుంటున్నా మెయిన్ టార్గెట్ మాత్రం కాంగ్రెస్సే అనటంలో సందేహంలేదు. రాజస్ధాన్ లో కూడా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు. చత్తీస్ ఘడ్ లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందేమో. ఏదైనా బీజేపీ చాలా అతి చేస్తోందనే అనుకోవాలి. చివరకు అతిచేస్తే గతి చెడుతుందని బీజేపీకి అర్ధం కావటంలేదు.






ముందు కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఎంఎల్ఏలను లాగేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేసింది. తర్వాత మధ్యప్రదేశ్ లో 27 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్నది. దాంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఫిరాయించిన ఎంఎల్ఏలతో వెంటనే బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. ఇపుడు కూడా అక్కడక్కడ కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాగేసుకుంటున్నది. ఒప్పుకుంటే కోట్లరూపాయలు లేకపోతే సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తోంది.




ఇందులో భాగంగానే గోవాలో తాజాగా 8 మంది ఎంఎల్ఏలను లాగేసుకున్నది. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకే విధేయులుగా ఉంటామని ఫిరాయించిన ఎంఎల్ఏలంతా దేవాలయాలు, మసీదులు, చర్చీల్లో ప్రమాణాలు చేశారని కాంగ్రెస్ చెప్పటమే. రాజకీయాల్లో విలువలను వదిలేసిన తర్వాత ఇక విధేయతా లేదా వంకాయా లేదు. వ్యక్తిగత లబ్దే ధ్యేయంగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ఎంతమంది విలువలు పాటిస్తున్నారు ? వీళ్ళు విధేయులుగా ఉండటానికి ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: