అమరావతి : ఒకే దెబ్బకు రెండుపిట్టలను కొట్టడమే జగన్ ప్లానా ?

Vijaya





వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లున్నారు. ఇంతకీ ఆ రెండు నియోజకవర్గాలు ఏవంటే కుప్పం, మంగళగిరి. రెండు నియోజకవర్గాల్లోను వచ్చే ఎన్నికల్లో చంద్రబాబానాయుడును ఎలాగైనా సరే ఓడించాలనేది జగన్ పట్టుదల. పనిలోపనిగా మంగళగిరిలో లోకేష్ ను కూడా ఓడించేస్తే ఓపనైపోతోందని అనుకున్నట్లున్నారు. రెండు నియోజకవర్గాల్లోను కామన్ పాయింట్ ఒకటుంది.



అదేమిటంటే బీసీ సామాజికవర్గాల ఓట్లు. కుప్పం నియోజకవర్గంలో అనేక సామాజికవర్గాలున్నప్పటికీ బీసీలే ఎక్కువ. ఇందులో కూడా వన్నెకుల క్షత్రియుల జనాభా ఇంకా ఎక్కువ. బీసీల తర్వాత ఎస్సీలున్నారు. ఇపుడు ఎంఎల్సీ భరత్ వన్నెకుల క్షత్రియుల సామాజికవర్గానికి చెందిన నేతే. సామాజికవర్గంతో పాటు పార్టీలోను, నియోజకవర్గంలో కూడా పట్టున్న నేత. కాబట్టి వచ్చే ఎన్నికల్లో భరత్ ను పోటీచేయించి చంద్రబాబును ఓడించాలనేది జగన్ ప్లాన్.



ఇక మంగళగిరిని తీసుకుంటే ఇక్కడ కూడా బీసీ సామాజికవర్గం జనాభానే ఎక్కువ. బీసీల్లో కూడా చేనేతల సామాజికవర్గానిదే  డామినేషన్. బీసీల తర్వాత ఎస్సీలు, రెడ్లు, ముస్లింలు, కాపు, కమ్మ తదితర సామాజికవర్గాలు కూడా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా బీసీల మద్దతులేకుండా సాధ్యంకాదు.  ఇపుడు వైసీపీ తరపున ఎంఎల్ఏగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను రెండోసారి ఓడించటంలో భాగంగా  చేనేతలకే చెందిన మురుగుడు హనుమంతరావుకు జగన్ ఎంఎల్సీ ఇచ్చారు. ఈయన వయసులో పెద్దవారే అయినా చేనేతల్లో పట్టున్న నేతనే చెప్పాలి.



మురుగుడుతో మాత్రమే పనికాదని జగన్ అనుకున్నట్లున్నారు. అందుకనే టీడీపీలో కీలకంగా ఉన్న గంజి చిరంజీవిని పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇంతకాలం లోకేష్ వ్యవహారాలను నియోజకవర్గంలో గంజే చూసేవారు. ఈయనది కూడా చేనేతసామాజికవర్గమే. ఇంతటి కీలకనేత హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేయటం చంద్రబాబు, లోకేష్ కు షాకిచ్చినట్లయ్యింది. అంటే జగన్ ప్రత్యేక ప్లాన్ ఏమిటంటే కుప్పం, మంగళగిరిలో బీసీ ఓట్లను టీడీపీకి పోనీకుండా చూడటమే. తన ప్రయత్నాల్లో జగన్ సక్సెస్ అయితే ఒకేదెబ్బకు చంద్రబాబు, లోకేష్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: