ఈడీ ముందుకు చీకోటి.. ఆ నేతల్లో గుబులు..

Deekshitha Reddy
చీకోటి ప్రవీణ్ మాధవ రెడ్డిని ఈరోజు ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఈ విచారణలో తమ పేర్లు బయటపడతాయేమోనని చాలామంది నాయకులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినీ నటీనటులు కూడా కాస్త ఆందోళనలో ఉన్నారు. అసలు చీకోటి విచారణలో ఏం జరుగుతుంది..? ఏయే విషయాలపై అధికారులు ఎంక్వయిరీ చేస్తారు, ఏయే వ్యవహారాలను ఆరా తీస్తారనేది సస్పెన్స్ గా మారింది.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు..
మరోవైపు చీకోటి ప్రవీణ్ మీ పార్టీకి దగ్గరి వ్యక్తి అంటే, మీ పార్టీకి దగ్గరి వ్యక్తి అంటూ.. ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ కూడా కొంతమంది వైసీపీ నేతల ఫొటోలతో ప్రచారం చేసింది.
చీకోటి వ్యవహారంలో ఏమవుతుంది..?
చీకోటి వ్యవహారంలో డబ్బులు హవాలా పద్ధతిలో భారత్ కు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ. ఈడీ ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలు పెట్టింది. తాను మాత్రం క్యాసినో, జూదం అధికారికంగా ఉండే దేశాల్లో మాత్రమే ఆ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు చీకోటి. ఇక్కడి నేతలకు కూడా ఇలాంటి క్యాసినోలకు వెళ్లే అలవాటు ఉంది. అది కేవలం ప్రైవేట్ వ్యవహారం. కానీ వారంతా ఇప్పుడు అధికార పార్టీ నేతలు. దీంతో వారిలో గుబులు మొదలైంది. ప్రజా జీవితంలో ఉన్న వారు ఇలా క్యాసినోల చుట్టూ తిరగడం ఏంటని, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల వారికి కూడా చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయని రుజువైనా, వారు ప్రస్తుతం అపోజిషన్లో ఉన్నారు కాబట్టి పెద్దగా విమర్శలు పనిచేయవు. ఇప్పుడు ఇబ్బంది అంతా అధికార పార్టీ నేతలకే ఉండేలా కనిపిస్తోంది. అయితే ఈరోజుతో ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. ప్రవీణ్ వెల్లడించిన విషయాలు బయటకు లీకవుతాయేమోనని ముందుగానే నేతలు హడావిడి పడుతున్నారు.
ఇప్పుడే ఎందుకు..?
చీకోటి ప్రవీణ్ ఎప్పటినుంచో క్యాసినోలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడే ఇదంతా ఎందుకు అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నేపాల్ లో నిర్వహించిన క్యాసినో వ్యవహారం బయటపడిన తర్వాత దీనిపై ఈడీ దృష్టిసారించింది. సోదాలు చేసింది, ఇప్పుడు విచారణకు పిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: