పార్లమెంట్ నియోజకవర్గాలలో సీనియర్లు పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి నేరుగా అధిష్టానానికి చెప్పినా ఫలితం లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ తయారైంది. అంత పెద్ద సముద్రంలో ఎవరి దారి వారిదే కావడం, గ్రూపు తగదాలు కారణంగా తరుచూ కలహాలు విరహాలు వియోగాలు పెరిగిపోతుండడం తదితర కారణాల రీత్యా కాంగ్రెస్-ఐ లో ఐక్యత లేదు. దీని ప్రభావంతో నగర పరిధిలోనే కరీంనగర్, ఖమ్మం లాంటి ప్రాంతాలలో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. కీలక సందర్భాల్లో సీనియర్ నాయకులు మాట్లాడకుండా ఉంటే అది పార్టీకే చావు దెబ్బలాంటిది అని, అలాంటప్పుడు నాయకులు ఉన్నా వ్యర్థమేనని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా నగర పార్టీలో మార్పులు రావాల్సి ఉంది. గతంలో పట్టున్న పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నీ ఇవాళ టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇదే సమయంలో మరో జాతీయ పార్టీ బీజేపీ ఎదగాలని కూడా చూస్తోంది. ఇవేవీ పట్టకుండా రాజకీయం చేయడం అన్నది ఓ అవివేకం కావొచ్చు.కేవలం అంతర్గత కుమ్ములాటల కారణంగానే నాయకులు విడి విడి ప్రచారాలు చేసుకుంటే ఫలితాలు అయితే ఆశించిన రీతిలో ఉండవు గాక ఉండవు.
టీ కాంగ్రెస్ ను ఇంఛార్జులు వేధిస్తున్నారు.వాళ్లంతా సీనియర్లే కానీ వివిధ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జులుగా ఉన్నారు.వీళ్లంతా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తున్నా చేసిన పనేం లేదని సొంత పార్టీ వర్గాలే విస్తుబోతున్నాయి.పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు అందుకున్న నాటి నుంచి ఇప్పటివరకూఈ తగాదాలేవీ తేల్చలేకపోతున్నారు. పార్టీలో ఉన్నవారంతా దాదాపు ఆయన కన్నా సీనియర్లే ! పార్టీ పేరుతో జనంలోకి వెళ్లి నాలుగు పదవులు అనుభవించినవారే! కానీ ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉండేటప్పటికీ అవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని పోకుండా సైలెంట్ అయిపోతున్నారు.
ఈ కోవలో గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్,జగ్గారెడ్డి,మహేంద్ర గౌడ్,అజారుద్దీన్ తో సహా ఇతర నేతలు కూడా ఉన్నారు.వీరిని దార్లో పెట్టాలన్నా,వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతంకు సంబంధించి దృష్టి సారించి,అందుకు తగ్గ కార్యాచరణ అమలు చేయాలని చెప్పాలన్నా రేవంత్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.పార్టీలో రాహుల్ వర్గం కొందరు ప్రియాంకవర్గం కొందరు ఉండగా,అదే సమయంలో వైఎస్ వర్గం ఒకరు, ఉత్తమ్ వర్గం ఒకరు అని కూడా కొందరు వేరు కుంపటి పెట్టారు.కోమటిరెడ్డి ఎపిసోడ్ కూడా పెద్దగా పరిష్కారం కావడం లేదు.దీంతో వచ్చే ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా కూడా సరిగా పనిచేయకుండా ఉంటే సీనియర్లుకు జీరో మార్కులు దక్కడం ఖాయం.