వైసీపీకి ఎంపీ క్యాండెట్లు కరువయ్యారా..!
రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడ - గుంటూరు లోక్సభ స్థానాలను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక్కడనుంచి గల్లా జయదేవ్ , కేశినేని నాని ఇద్దరూ కూడా స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల పోటీ చేసిన పొట్లూరి వర ప్రసాద్ - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇద్దరూ కూడా ఇప్పుడు వైసీపీ లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోవడంతో సైలెంట్ అయిపోయారు. రాజధాని ప్రాంతంలో ఇప్పుడు అధికార పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరిద్దరికి ఆసక్తి లేదని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఓడిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తరువాత తనకు ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ ఆయనను పట్టించుకోలేదు. అధికార పార్టీలో ఉన్న కూడా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిన పొట్లూరి వరప్రసాద్ అసలు వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పైగా రాజధాని ప్రభావం విజయవాడ నగరం పై ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. పీవీపీ వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓడేందుకు తాను సిద్ధంగా లేనని సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా అధికార పార్టీ ఇంత బలంగా ఉండి కూడా ఈ రెండు చోట్ల ఆ పార్టీ కి ఎంపీ క్యాండెట్లు కరువైన పరిస్థితి.