తెలంగాణలో లాక్‌డౌన్.. వారి పరిస్థితి ఏంటి..?

Shanmukha
హైదరాబాద్: కరోనా దేశంలో అల్ల కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ రోజురోజుకి వేలల్లో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు విఫల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దేశంలో లాక్‌డౌన్ విధించడంతోనే భారత్ గట్టెక్కుతుందని ఇప్పటికే పలు దేశ నిపుణులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. తాజాగా తెలంగాణ కూడా 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు ఉంటుంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటాయి. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా అప్పుల పాలైన మధ్య తరగతి కుటుంబాలు ఇప్పటికీ ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేదు. ఇంతలోనే మరో సారి లాక్‌డౌన్ రావడం వారిని కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వేల మంది ఉపాధిని కోల్పోయారు. వారికి ఇప్పటికే రోజు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ వారిని మరింత దిగజార్చనుంది. అంతేకాకుండా ఈ లాక్‌డౌన్ కారణంగా మరింత మంది తమతమ ఉపాధిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు.
ఇక వలస కార్మికులు, రోజు కూలీల పరిస్థితి మరింత దుర్భరం కానున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని రోజు కూలీలు ఇల్లు గడవక, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వలస కార్మికుల పరిస్థితి అదే విధంగా తయారవుతుంది. చేసేందుకు పని లేక, తమ సొంత ప్రదేశాలకు వెళ్లేందుకు వెసులు బాటులేక ఇబ్బంది పడతారు. అంతేకాకుండా అద్దె ఇళ్లలో ఉండే వారికి ప్రతి నెల ఆ అద్దె కట్టడం గగనం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడి కష్టాలు ఎన్నో వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం ఏ దారి చూపిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: