ప్రేయసి మరణించిందంటూ దుబాయిలో ఉన్న యువకుడికి ఫోన్.. తరువాత జరిగిందిదీ!

హైదరాబాద్: ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కొంత మంది కొంత కాలం పాటు బాధ పడి మళ్లీ తమ జీవితాన్ని సాధారణంగా కొనసాగిస్తూ ఉంటారు. మరి కొంత మంది జీవితాంతం దూరమైన వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బతికేస్తున్నారు. ఇంకొంత మంది మరణించిన మనిషి లేని జీవితం అనవసరం అని తాము కూడా ప్రాణాలు తీసుకుంటారు. తెలంగాణలో సరిగ్గా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన మానాల రాజేష్ అనే 24 ఏళ్ల వ్యక్తి, గోవిద పల్లి గ్రామానికి చెందిన ఓ యువతి చాలా కాలం నుంచి ప్రేమించుకుంటూ వచ్చారు.
తెలంగాణలో మంచి ఉద్యోగం రావడం లేదని రాజేష్ ఉపాధిని వెతుక్కుంటూ గత ఏడాది దుబాయికి వెళ్లాడు. దుబాయి వెళ్లిన తర్వాత కూడా వారి మధ్య ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. పైగా మరింత పెరుగుతూ వచ్చింది. త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తానని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువతికి రాజేష్ చెప్పాడు. అయితే ఇటీవల వారిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది. ఇద్దరికి వివాహం జరిపించే అవకాశమే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. రాజేష్‌తో వివాహం జరగకపోతే తాను బతికి ఉండటం కూడా వృధా అని భావించింది.
రాజేష్‌ను మర్చిపోలేక ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన కొద్ది గంటల తర్వాత రాజేష్‌కు స్నేహితులు ఫోన్ చేసి ప్రేయసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. దీంతో రాజేష్ నోట మాట రాలేదు. తన ప్రేయసి లేని జీవితం తనకు మాత్రం ఎందుకు అని అనుకున్నాడు. అంతే.. తాను ఉంటున్న గదిలోనే ఉరేసుకుని తాను కూడా ప్రేయసి వద్దకు వెళ్లిపోయాడు. రాజేష్ ఉరి వేసుకునే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన తల్లికి పంపించాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: