మోడీజీ మీ సాయం కావలి.. ఉక్రెయిన్ రిక్వెస్ట్?
రష్యా దాష్టీకాన్ని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఇక ఇటీవల భారత సహాయం కోరుతూ ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తి కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దయచేసి రష్యా దాడులతో సంక్షోభ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ను కాపాడేందుకు రష్యాతో మంతనాలు జరపాలంటూ భారత్లో ఉన్న ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలికా కోరినట్లు తెలుస్తోంది. సైనిక చర్య అని ప్రకటిస్తున్నా రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. రష్యాకు చెందిన బలగాలు సరిహద్దులను దాటి దేశ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. కొన్ని చోట్ల సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా రష్యా దాడిలో మృతి చెందారు.
రష్యా ఎడతెరిపి లేకుండా దాడి చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో పరిస్థితులు క్రమ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్ జోక్యం చేసుకుని మాకు అండగా నిలవాలని కోరుతున్నాము. భారత్ ఎంతో ప్రభావవంతమైన దేశం.. దౌత్య పరంగా మీ హిస్టరీ గురించి మాకు తెలుసు.. గతంలో ఎన్నో సార్లు శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించింది. ఇక రష్యాతో భారత్ కి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి రష్యా వెనక్కి తగ్గేలా చేయడానికి భారత్ సహకరించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా ఫోన్ చేసి మాట్లాడాలి. ఎవరు చెప్పినా పుతిన్ వింటారో లేదో తెలియదు. కానీ మోడీ చెబితే మాత్రం వింటారు. అందుకే ఈ యుద్ధాన్ని ఆపేందుకు మీ సహాయం కోరుతున్నాం అంటూ భారత్లో ఉన్న రాయబారిగా పోలిక కోరారు.