కాళ్ల పారాణి ఆరకముందే నవదంపతులు మృతి..?

Suma Kallamadi
కాళ్ల పారాణి ఆరకముందే నవదంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎన్నో ఆశలు, కలలతో ఎంతో సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఈ నవ దంపతులు అర్ధాంతరంగా చనిపోవడం ప్రస్తుతం అందరినీ కలచి వేస్తోంది. కనీపెంచీ పెద్ద చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల రోదన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఊహించని రోడ్డు ప్రమాదంలో ఈ నూతన జంట మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
ఇంతకీ ఈ దుర్ఘటన ఎక్కడ జరిగిందో వివరంగా తెలుసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన 28 ఏళ్ల విష్ణు వర్ధన్, కడపకు చెందిన 25 ఏళ్ల కుల్వ కీర్తి చిన్నతనం నుంచే బాగా చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి అమెరికా దేశంలో మంచి ఉద్యోగాలు సంపాదించారు. వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడి పోయారు. ఐతే తమ పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యారని తల్లిదండ్రులు ఎంతో సంతోషించి వీరిద్దరికీ పెళ్లి కుదిర్చారు. జూన్ 19వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు. అయితే రెండు రోజుల క్రితం ఈ నవదంపతులు బెంగళూరులోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లారు. అయితే తిరిగి కారులో ఇంటికి వస్తుండగా బొమ్మేపర్తి గ్రామ సమీపంలో హఠాత్తుగా ఒక ద్విచక్ర వాహనం అడ్డొచ్చింది. దీంతో ఆ వాహనాన్ని తప్పించేందుకు విష్ణు వర్ధన్ కారు స్టీరింగ్ ని బలంగా పక్క తిప్పాడు. దీంతో ఆ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం అటువైపుగా వెళుతున్న మరొక వాహనాన్ని ఢీ కొట్టి గుంతలో పడి పోయింది.
అయితే ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నవ దంపతులిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు హుటాహుటిన దంపతులిద్దరిని కారులో నుంచి వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో కీర్తి ప్రాణాలు కోల్పోయారు. విష్ణువర్ధన్ పరిస్థితి కూడా క్షీణించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: