గత కొంతకాలంగా పలు కేసులతో ఇబ్బంది పడుతూ, వాటిపై న్యాయపోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఊరట లభించింది.ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు 53 రోజులు రాజామండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పై వచ్చిన చంద్ర బాబు ఆ తరువాత ఆ కేసుతో పాటు మిగిలిన కేసులపైనా న్యాయపోరాటం చేస్తున్నారు ఇందులో భాగంగా ముందుగా ముందస్తు బెయిల్ కోసం బాబు ప్రయత్నిస్తున్నారు.ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హై కోర్టు తీర్పు వెల్లడించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైనమెంట్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు పిటిషన్లు దాఖలు చేశారు.ఇప్పటికే ఆ మూడు పిటిషన్లపైనా గొడవలు ముగిసిన నేపథ్యంలో నేడు హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇందులో భాగంగా మూడు కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.అలాగే ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు డిసెంబర్ 20నే పూర్తయ్యాయి.ఉచిత ఇసుక వ్యవహారంలో రాష్ట్ర ఖజానాకు బాగా నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంకా సీఐడీ తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు.రెండు వైపులా వాదనలు ముగియడంతో పిటిషన్ పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా గతనెల రెండోవారంలోనే పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో ఈ మూడు కేసులకు సంబంధించి తాజాగా హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.