
ఆ విషయంలో ఎమ్మెల్యేలకు ఫైనల్ అలర్ట్ జారీ చేయబోతున్న జగన్....!!
ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహణకు నిర్ణయించారు. ఇప్పటి వరకు నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన పలు దఫాలు సీఎం జగన్ సమీక్షలు నిర్వహించారు. ప్రజలతో మమేకం అయిన ఎమ్మెల్యేల పని తీరు గురించి నివేదికలను విశ్లేషించారు. వెనుకబడిన వారికి పని తీరు మెరుగుపర్చుకొనేందుకు సమయం ఇచ్చారు. ఎమ్మెల్యే ల గ్రాఫ్ పెరగకుంటే మార్పు తప్పదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.ఎమ్మెల్యేలకు ఫైనల్ అలర్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో నిర్వహించే వర్క్ షాప్ లో ఎమ్మెల్యేల పని తీరు పై తుది నివేదికను వెల్లడించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నివేదికల్లో ఇప్పటి వరకు పని తీరు మెరుగ్గా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది.
పని తీరు, పార్టీ వ్యవహారాలు, ప్రజలతో మమేకం వంటి అంశాల్లో గ్రాఫ్ సరిగ్గా లేని వారి స్థానాల్లో మాత్రం కొత్త సమన్వయకర్తలను నియమించక తప్పదని స్పష్టం చేసేందుకు సిద్దం అవుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. తప్పించే వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవటం..అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ప్రాధాన్యత కొనసాగిస్తారని చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉందనే దాని పైన ఇప్పటికే సీఎం వద్దకు నివేదికలు చేరాయి.