తెలుగు సాహిత్య వెన్నెల మన సిరివెన్నెల ..... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేకమంది పాటల రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఒకింత ప్రత్యేకమైన పేరు ఉంది. తొలిసారిగా విశ్వనాధ్ తెరకెక్కించిన జనని జన్మభూమి సినిమా ద్వారా టాలీవుడ్ కి గేయ రచయితగా తన కెరీర్ ని ప్రారంభించిన సీతారామశాస్త్రి ఆ తరువాత బెనర్జీ, సుహాసిని నటించిన సిరివెన్నెల సినిమా ద్వారా గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక ఆ సినిమాలో ఆయన రాసిన అద్భుతమైన సాంగ్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. ఇక ఆ సినిమాలోని విధాత తలపున ప్రభవించినది అనే పాట కు ఆయన అందించిన సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ తరువాత స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం వంటి సినిమాలతో మరింతగా తన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సిరివెన్నెల, ఆ తరువాత మాధవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటతో అందరినీ కదిలించారు అనే చెప్పాలి. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ తీసిన చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది అనే పాటతో మన మనసులు తాకారు. ఆ విధంగా ఆయన కలం నుండి జాలువారిన గొప్ప గొప్ప పాటలు ఎన్నో, ఎన్నెన్నో అనే చెప్పాలి.
ఇక కెరీర్ పరంగా దాదాపుగా అందరూ టాలీవుడ్ స్టార్స్ తో పని చేసిన గొప్ప అనుభవం కలిగిన సిరివెన్నెల మొత్తంగా తన సినిమా కెరీర్ లో 3000 పైచిలుకు సాంగ్స్ రాయడం జరిగింది. తన సీనియర్స్ కి సైతం ఎంతో పోటీని ఇవ్వడంతోప్ పాటు వారి నుండి మంచి ప్రశంశలు అందుకున్న సిరివెన్నెల మన తెలుగు సినిమా సాహిత్య వెన్నెల అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తెలుగు భాష జీవించి ఉన్నంత కాలం సిరివెన్నెల పాట ఎప్పటికీ మన తెలుగు వారి మదిలో జీవించి ఉంటుందని పలువురు కళాభిమానులు చెప్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: