హరికృష్ణ వల్ల అది వదిలేసుకున్న తారక్...?
"నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ టీవీలో క్రికెట్ చూడటాన్ని అస్సలు ఇష్టపడను. దానికి కారణం మా నాన్న హరికృష్ణ అని నేను చెప్తాను. ఎందుకంటే నా చిన్నతనంలో.. మొత్తం క్రికెట్ మ్యాచ్ ని వీసీఆర్ రికార్డ్ లో చేయమని మా తండ్రి అడిగేవారు. ఆయన చాలా బిజీగా ఉండేవారు. పొద్దున్నే వచ్చే మ్యాచ్లను సాయంత్రం చూసేందుకు నా చేత రికార్డ్ చేయించేవారు. దాంతో నేను ప్రతిసారీ మొత్తం క్రికెట్ మ్యాచ్ ని రికార్డ్ చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత సాయంత్రం పూట మా తండ్రితో కలిసి మళ్ళీ అదే మ్యాచ్ చూడాల్సి వచ్చేది. ఈ విధంగా చాలా సార్లు జరిగిన తర్వాత నాకు క్రికెట్ చూడాలంటేనే విరక్తి వచ్చేసింది. చిన్నతనంలోనే ప్రతి మ్యాచ్ ని రెండుసార్లు చూడాల్సి రావడం తో నాకు మెల్లిగా టీవీలో క్రికెట్ చూడడం పట్ల అయిష్టం పెరిగిపోయింది" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
దాంతో తారక్ అసలు క్రికెట్ చూడరని అభిమానులందరికీ అర్థం అయింది. ఇకపోతే తారక్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేశారు. రాజమౌళి తెరకెక్కించనున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై భారతదేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ తొలి పాన్ ఇండియా మూవీ కాబోతోంది. రామ్ చరణ్ కూడా ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్ కాబోతున్నారని చెప్పుకోవచ్చు.