పూరి విజయ్ దేవరకొండను అంతర్మధనంలో పడేసిన ఆఫర్ !
కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి రావడంతో ఇప్పుడు మళ్ళీ టాప్ హీరోల సినిమాల షూటింగ్ లు అన్నీ మొదలు కావడమే కాకుండా ఆ సినిమాల రిలీజ్ డేట్ ను చాల ముందుగా ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండల ‘లైగర్’ మూవీ కూడ చేరిపోయింది.
వాస్తవానికి ఈమూవీని కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎదురు కాకుండా ఉండి ఉంటే షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో అనుకున్న విధంగా రిలీజ్ కు రెడీ అయి ఉండేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులలో ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి ఒక కొత్త రిలీజ్ డేట్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
టాప్ హీరోల సినిమాలు అన్నీ దసరా రేస్ కు పోటీ పడుతున్న పరిస్థితులలో ఆ రేస్ లో ‘లైగర్’ కు అవకాశం దక్కడం కష్టంగా మారింది. దీనితో ఆ మూవీని నవంబర్ ప్రాంతంలో విడుదల చేయవలసిన పరిస్థితి. అయితే వైద్య నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఆధారంగా మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు నవంబర్ లో వచ్చే ఆస్కారం ఉంది. అదే జరిగితే సినిమాలకు మళ్ళీ సమస్యలు మొదలవుతాయి.
ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈమూవీకి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి వచ్చిన భారీ ఆఫర్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ‘లైగర్’ మూవీ ఓటీటీ శాటిలైట్ హక్కులను తమకు ఇస్తే తాము 200 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కాని విజయ్ దేవరకొండ సినిమాకు ఒక భారీ ఆఫర్ అనుకోవాలి. వాస్తవానికి విజయ్ దేవరకొండకు తెలుగు ప్రేక్షకులలో ఇమేజ్ ఉంది కానీ అతడి గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి వచ్చిన ఓటీటీ ఆఫర్ వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి..