పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో రాధేశ్యామ్ సినిమా ఒకటి ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్యాచ్ వర్క్ లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 15రోజులు షూటింగ్ ప్లాన్ చేయగా అంతలోనే కరోనాతో బ్రేక్ పడింది. దాంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక హైదరాబాద్ లోనే షూటింగ్ జరపనున్నారు. అంతే కాకుండా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను ముంబైలో మెదలు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రంలో ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసినట్టు దర్శకుడు ఓం రౌత్ ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. అయితే కరోనా విజృంభణ ముంబైలో మరీ ఎక్కువగా ఉండటంతో షూటింగ్ ను ఇప్పుడు హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా మేకర్స్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ప్రభాస్ కేజీఎఫ్ తో రికార్డులు బద్దలు కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలో నటిస్తున్నారు. సలార్ సినిమా మొదటి షెడ్యూల్ ను రామగుండంలోని బొగ్గుగనుల్లో చిత్రించారు. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలో ప్రత్యేక సెట్ వేసి కొన్ని రోజులు షూట్ చేశారు. తర్వాత ముంబై రాజస్థాన్ కర్నాటక లో షూట్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో అంతా తారుమారయ్యింది దాంతో ఈ చిత్రాన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ ప్రభాస్ సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకోనున్నాయి. ఆ తరవాత విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో తీయాల్సిన భాగాలను పూర్తి చేస్తారట. మొత్తానికి ప్రభాస్ ఒకేసారి హైదరాబాద్ లో మూడు సినిమాలను ప్లాన్ చేసి హైదరాబాద్ నా అడ్డా అంటున్నారు.