సినిమా హాల్స్ మళ్లీ మూసి వేస్తారా..
మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలా ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్త సినిమాను చూసేందుకు తహతహలాడుతున్నారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు వందల, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.
అలా జరిగితే ముందస్తుగా థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు మూసివేస్తారు. ప్రజలు రద్దీగా తిరిగే ఈ ప్రాంతాలు కరోనా కేసుల పెరగడానికి కారణం అవుతాయి కాబట్టి వీటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సినిమా హాల్స్ మూసివేస్తే మళ్ళీ టాలీవుడ్ కుదేలవ్వడం ఖాయం. అయితే కొందరు నిర్మాతలు తమ సినిమాలు త్వరగా విడుదల చేసి కనీస వసూళ్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. మరి త్వరలో కరోనా ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టి థియేటర్లను మూసివేయాలని నిర్ణయిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.