గార్డెనింగ్ పై మక్కువ పెంచుకున్న సమంత అక్కినేని..!

Suma Kallamadi

మార్చి నెలలో భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా... సినీ ప్రముఖులంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తమ క్వారంటైన్ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు ఫిట్నెస్ పెంచుకునేందుకు రకరకాల యోగాసనాలు,  వ్యాయామాలు చేస్తున్నారు. కానీ సమంత అక్కినేని మాత్రం అందరి సెలబ్రిటీలకు భిన్నంగా తన క్వారంటైన్ సమయాన్ని చాలా తెలివిగా సద్వినియోగం చేసుకుంటుంది. తన ఇంటి టెర్రస్ పై మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్న సమంత అక్కినేని హైదరాబాద్ నగరంలో ప్రముఖ గార్డెనింగ్ నిపుణులను సంప్రదించి కొంత స్థలంలోనే మొక్కలు ఎలా పెంచాలో తెలుసుకున్నారు . 


ఇంటర్నెట్ లో కూడా ప్రముఖ మాస్టర్ క్లాస్ గార్డెనింగ్ కోర్సులు నేర్చుకుంటూ సరికొత్త విషయాలను తెలుసుకుంటుంది. ఆమె తన టెర్రస్ పై మొక్కలు పెరిగే విధంగా అన్ని సదుపాయాలను సమకూర్చి ఎరువులు, విత్తనాలు తెచ్చుకొని వాటిని సరైన సమయంలో నాటి పెంచి పెద్ద చేసింది. ఇటీవల ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన ఇంట్లో పెరిగిన మొక్కల ఫోటోలను షేర్ చేసి చాలా ఆనందం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ సమయంలో జీవితంలో ఏవి ముఖ్యమైనవో తెలుసుకున్నానని సమంత చెబుతోంది. ఆహారం చాలా ముఖ్యమైనదని ఆమె తెలుసుకున్నట్టు తెలిపింది.


సమంత ఒక ప్రముఖ న్యూస్ వెబ్సైటు తో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో చైతూ, నేనూ కలసి ప్రతిరోజు సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులు,  కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం. ఎన్ని కూరగాయలు కొనుగోలు చేయాలో నాకు బొత్తిగా ఐడియా ఉండకపోయేది. లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారో కూడా తెలియని పరిస్థితులలో మేము సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకుంటున్న సరుకులు, కూరగాయలు ఎన్ని రోజులు వరకు వస్తాయో, మేము వాటిపై కొద్ది రోజులైనా బతకగలమో బతకలేమో అనే ఒక భయంకరమైన ఆలోచన నాలో కలిగింది. అందుకే స్వయంగా నేనే మా ఇంట్లో మొక్కలను పెంచి సరిపడినన్ని కూరగాయలను పండించాలి అనుకున్నాను. ఇంట్లోనే కూరగాయలు పండించడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. గార్డెనింగ్ అనేది నా మనసుకు చాలా ప్రశాంతతను కూడా కలిగిస్తోంది' అని సమంత అక్కినేని తెలిపింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో క్యాబేజీ మొక్కలు ఎలా పెంచాలో కూడా చాలా చక్కగా వివరించింది. ఏదేమైనా ఈ లాక్ డౌన్ సమయంలో ఓ చిన్నపాటి రైతు అయిపోయింది సమంత అక్కినేని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: