మన దేశంలో తెలుగు సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి ఎదుగుతూ వస్తోంది. సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరుగుతోంది. పొరుగు దేశాల్లో కూడా మనదే హవా నడుస్తోంది. బాలీవుడ్ను సైతం ఢీ కొట్టేలా టాలీవుడ్ ఎదుగుతోంది. దీనికి తోడు `బాహుబలి` కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
హిందీ మార్కెట్లో మన సినిమాల డబ్బింగ్ రైట్స్ కి .. అక్కడ శాటిలైట్ రైట్స్ కి బాగా క్రేజ్ పెరిగింది. నవ్యపంథా కథలతో తెలుగు సినిమాల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇతర భాషల వారు పోటీ పడి కొనుక్కోవడంతో రేట్లు కూడా పెంచాల్సి వచ్చింది. తెలుగు సినిమాల మీడియం రేంజ్ హీరోల హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్కు పోటీ పడి మరీ భారీ రేట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కునే వారందరూ కలిసి ఓ సిండికేట్గా మారారట.
ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి అంత పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి రావడం తమకు నష్టాన్ని కలగచేస్తుందని వారందరూ కలిసి ఒక కూటమిలా ఏర్పడి టాలీవుడ్పై కుట్ర చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ హీరోకు కూడా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.12 కోట్లు పలుకుతోంది. మరి టాప్ హీరోలకు అయితే రూ. 25-30 కోట్ల వరకూ పలుకుతోంది. దీన్ని అంతా తగ్గించాలని ముంబై సిండికేట్ మనల్ని పెద్ద దెబ్బ కొట్టేందుకు కుట్ర పన్నుతోంది. సిండికేట్ అవ్వడం అంటే వాళ్లకు వాళ్లు పోటీ లేకుండా మన సినిమాల రేట్లు తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీని వల్ల బేరం లేకుండా చేసి వాళ్లు చెప్పిన రేటుకే ఇచ్చేలా చేస్తున్నారట. అందువల్ల ఇకపై తెలుగు సినిమాల హిందీ రైట్స్ కి ఎక్కువ రేటు పలకదు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ గురించి ఆసక్తిగా మాట్లాడుకున్న వాళ్లు ఇకపై ఆ సీన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ మీటింగ్ విషయాన్ని అగ్ర నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో వాళ్లకు రివర్స్ స్ట్రోక్ ఇవ్వడానికి టాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది.