ఇళయరాజాకు పద్మ విభూషణ్ సత్కారం !
భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డ్స్ లో సినీ సంగీత చక్రవర్తి ఇళయరాజాకు పద్మ విభూషణ్ సత్కారం లభించింది. సినిమా సంగీతానికి ఒక కొత్త ఒరవడి సృష్టించి కొన్ని దశాబ్దాల పాటు 1000 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’ లభించడం దక్షిణాది సినిమా రంగాన్ని గౌరవంగా భావిస్తున్నారు.
ఎఫ్ ఎమ్ లో కాని ఒక ఛానల్ లో కాని ఇళయరాజా మ్యూజిక్ సమకూర్చిన పాటలు ప్రసారం చేయకుండా ఒకరోజు కూడ పూర్తికాదు అంటే అది అతిశయోక్తి కాదు. ఒక తమిళుడుగా పుట్టిన ఇళయరాజాకు మన తెలుగు ప్రేక్షకులలో కూడ కోట్లాదిమంది సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
క్లాస్ ప్రేక్షకులకు మాస్ ప్రేక్షకులకు నచ్చే పాటలను ఇవ్వగల శక్తి ఇళయరాజా సొంతం. ఇప్పటికీ తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాల విషయంలో రోజుకు ఈ సంగీత చక్రవర్తి 15 గంటలు కష్టపడతాడు అంటే సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఇష్టం కనపడుతుంది. ఇప్పటికీ ఇళయరాజా చేసే స్టేజ్ షోలకు వేల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు వస్తారు అంటే ఆయన స్థాయి తెలుస్తుంది.
2018 సంవత్సరానికిగాను 'పద్మ' అవార్డులకోసం దేశ వ్యాప్తంగా 15, 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా మన తెలుగు రాష్ట్రాల నుండి వివిధ రంగాలకు ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ఏ ప్రముఖుడుకి కూడ పద్మ అవార్డులు రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ కోటాలో బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ సత్కారం ఇచ్చారు. ఇళయరాజాకు వచ్చిన సత్కారాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన సత్కారంగా భావించుకోవాలి..