సూసైడ్ నోట్ : ఆ ఇంటివారిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దు
ఇక సాధారణ గృహ హింసల విషయానికి వస్తే, వాటిలో ఎక్కువ నేపథ్యం వరకట్నం లాంటి దురాశ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అలాంటి వారిని ఉపేక్షించకుండా తగిన విధంగా శిక్షలు విధించడం లేదా ప్రారంభ దశలోనే మానసిక నిపుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తేవచ్చు అంటున్నారు. అయినా వారిలో మార్పు లేకపోతే అప్పుడు శిక్ష అమలు చేయాలని వారు సూచిస్తున్నారు. మహిళలు చాలావరకు ధైర్యంగా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకా భర్తలపై ఆధారపడుతూ, అక్కడ ఇమడలేక, తల్లిదండ్రుల వద్దకు చేరలేక ఇరకాటంలో పడుతున్నారు.
అలాంటి ఒక ఘటన ప్రాంతీయంగా కలకలం రేపింది. గత ఏడాది వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఆ ఇంట అడుగుపెట్టిన మరుక్షణం నుండే వేధింపులతో నరకం చూపిస్తున్నప్పటికీ పుట్టింటివారు తన పెళ్లికోసం చేసిన అప్పుల భారం గుర్తుకు తెచ్చుకొని అవన్నీ భరిస్తూ వచ్చింది. ఏడాది గడిచింది, వేధింపులు పెరిగాయి తప్ప మార్పు లేదు. ఇక తాళలేక పుట్టింటికి వెళ్ళింది ఆమె. అక్కడ తల్లిదండ్రుల అప్పుల బాధలు కూడా చూస్తూ ఎక్కువ కాలం ఉండటం సాధ్యం కాదని అర్ధం చేసుకుంది. ఒక రాత్రి అందరితో కలిసి తిని, పడుకుంది. అందరు పడుకున్న తరువాత ఆత్మహత్య చేసుకుంది. తన మెట్టినింట్లో తాను అనుభవించిన నరకాన్ని సవివరంగా సూసైడ్ లేఖలో రాసి, ఆ ఇంటి వారిని ఎవరు పెళ్లి చేసుకోవద్దు అంటూ వాపోయింది. ఇదంతా తెల్లవారిన తరువాత తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు కేసు నమోదు చేసుకొని, నేరస్తుల కోసం గాలింపు చేస్తున్నారు.