జాతీయ జెండా వందనం - నియమాలు

kumar siva
భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్‌ కార్యమ్రాల్లోనూ జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు యిలా వున్నాయి.
 
సాధారణ నియమాలు:


★ జాతీయ జెండా చేనేత (ఖాదీ, కాటన్‌, సిల్క్‌) గుడ్డతో తయారైంది కావాలి.

★ జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో వుండాలి.
6300 x 4200 మి.మీ నుండి 150 x 100 మి.మీ వరకు మొత్తం 9 రకాల సైజ్‌ల జెండాలు పేర్కొనబడివి.

★ ప్లాస్టిక్‌ జెండాలు వాడకూడదు. చిన్నసైజ్‌ పేపరు జండాలు వాడవచ్చు.

★ పై నుండి క్రిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో వుండాలి.

★ జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి.
 
★ జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి.

★ జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు.

★ జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి.

★ జెండా పైన ఎలాంటి రాతలుగాని, ప్రింటింగ్‌ గాని వుండకూడదు.

★ ఇతర జండాలతో కలిపి చేయాల్సివస్తే, జాతీయ జండా మిగిలిన వాటి కంటె కొంచెం ఎత్తుగా వుండాలి. ప్రధర్శనలో అయితే మిగిలిన వాటి కంటె మధ్యలో ఒకడుగు ముందు వుండాలి.

★ జండా ఎప్పుడూ నిటారుగానే వుండాలి. క్రిందికి వంచకూడదు.


పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చెయ్యాల్సినవి.


★ పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో మూడు వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. నాలుగోవైపు మధ్యలో హెడ్మాష్టర్‌, స్టూడెంట్స్‌ లీడర్‌, జెండా ఎగురవేసే వ్యక్తి (హెడ్మాష్టర్‌ కాకపోతే) మూడు స్థానాల్లో నిలబడాలి.

★ విద్యార్థులను తరగతుల వారీగా 10 మందినొక స్క్వాడ్‌గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్‌ లీడర్‌ వరుస ముందు నిలబడాలి వరుసల మధ్యన, విద్యార్థుల మధ్యన 30 ఇంచ్‌ల దూరం వుండాలి.

★ క్లాస్‌ లీడర్‌లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్‌ లీడర్‌కి సెల్యూట్‌ చేయాలి. స్కూల్‌ లీడర్‌ వెళ్లి హెడ్మాష్టర్‌కి సెల్యూట్‌ చేయాలి. ఆ తర్వాత జండాను ఎగురవేయాలి.

జెండా ఎగురవేయటానికి ముందు స్కూల్‌ లీడర్‌ విద్యార్థ్థులను అటెన్షన్‌లో వుంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్‌ చేయించి కొద్ది సేపు అలా వుంచి ఆర్డ్‌ర్‌ చెప్పి అటెన్షన్‌లో వుంచాలి.

★ అటెన్షన్‌ వుంచి జాతీయ గీతం ఆలపించాలి, ఆతర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్మాష్టర్‌ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి.

జాతీయ దినోత్సవాల్లో జెండా వందనం సందర్భంలో చేయాల్సిన ప్రతిజ్ఞ
[Rule No.2.3-VII లో పేర్కొనబడింది.]
"I Pledge allegiance to the National  Flag and to the Soveriegn Socialist Secular Democratic Republic for which it stands"
       
అనుభవాలే ఆచరణకు మార్గాలు:


జండావందనం నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతోంది.

 Flag code of India సెక్షన్‌ v రూల్‌ నంబర్‌ 3.30 ప్రకారం రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు వుంచి ఎగురవేయవచ్చు.

★ జండా ఎగురవేయటానికి ముందు కొబ్బరికాయలు కొట్టడం, అగర్‌బత్తీలు వెలిగించటం, జాతీయనేతలు, కొన్నిదేవుళ్ళ ఫోటోలు పెట్టటం, బొట్లు పెట్టడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటాంటివి దేశ రాజధాని ఎర్రకోట వద్ద గాని, రాష్ట్ర రాజధానిలోగాని, జిల్లా కలెక్టరట్‌లోగాని చేయబడవు. ప్రభుత్వ పరంగా పై స్థాయిలో పాటించని పద్ధతులను పాఠశాలల్లోనూ పాటించకూడదు.

★ పాఠశాలల్లో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా కార్యనిర్వాహక బాధ్యులు (రాష్ట్రపతి, గవర్నర్‌, కలెక్టర్‌, ఎండిఓ, హెడ్మాష్టర్‌ మున్నగు) మరియు ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ ఛైర్మన్‌, గ్రామ సర్పంచ్‌ మున్నగు వారు) వారి కార్యాలయాల్లో ఎగురేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలల్లో జనవరి 26న మరియు ఆగస్ట్‌ 15న జాతీయ జండాను హెడ్మాష్టరే ఎగురవేయాలి.

★ జాతీయ జెండాని ఎగరేసే పోల్‌ గట్టిగా వుండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడివడే విధంగా వుండాలి. కొన్ని చోట్ల జెండా కర్రపడిపోవటం, పైకి వెళ్లిన తర్వాత ముడివిడకపోవటం, మళ్లీ కిందికి లాగటం, కాషాయ రంగు కిందికి వుండటం వంటి తప్పులు జరుగుతుంటాయి.

★ సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే వుండి జెండాని జాగ్రతగా క్రిందికి దించి మడత పెట్టి బీరువాల్లో వుంచటం హెడ్మాష్టర్‌ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదోటైమ్‌లో జెండా క్రింద పడటం, రాత్రికూడ ఎగురుతుండటం వంటి తప్పిదాల వలన హెడ్మాష్టర్‌లు సస్పెండ్‌ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జండావందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: