అరటి పండే కాదు.. అరటి పువ్వు ఆరోగ్యమే.. ఎలాగంటే..!
సాధారణంగా అరటి పండును అందరూ ఇష్టపడుతుంటారు. అందుకు కారణం.. అది అరోగ్యకరం.. రుచికరం. మరియు అన్ని సీజన్లలోనూ అరటి పండ్లు దొరకడం మరో బెనిఫిట్. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. శరీరానికి పోషకాలు అందడమే కాదు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పైగా శరీరానికి పుష్కలమైన శక్తి లభిస్తుంది. అయితే, అరటి పండు కంటే అరటిపువ్వుతో మరిన్ని లాభాలాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అరటి పండు లాగే పూవును కూడా మనం తినవచ్చు.
అరటి పువ్వు చూపులకే కాదు రుచికీ భేషుగ్గానే ఉంటుంది. వండటంలో ఒడుపులు వంటబట్టాలేకానీ అరటి పువ్వుతో కమ్మని వంటలు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. రక్తహీనత ఉన్నవారు అరటి పూవు కూరను తరచూ తినాలి. దీంతో రక్తం బాగా పడుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే అరటిపువ్వు కూర తింటే జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటివి దూరమౌతాయి. పాలిచ్చే తల్లులకు అరటిపువ్వు కూర మంచి ఆహారం. చాలా పోషకాలు లభించడం వల్ల అటు తల్లికి, ఇటు శిశువుకూ మంచి చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు అరటిపూవు కూరను తరచూ తింటుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. షుగర్ అదుపులోకి వస్తుంది. అదే విధంగా తరచూ అరటి పువ్వు తీసుకోవడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. మరియు అరటి పూవు కూరను తరచూ తింటుండడం వల్ల స్త్రీలకు రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే ఇబ్బందులన్నీ ఉండవు.