ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడేవారే. ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే అక్కడ సరైన చికిత్సలే అమల్లో ఉన్నాయి. వచ్చిన చిక్కల్లా కిడ్నీ జబ్బుతో బాధపడేవారిని సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణలు తెలియజేస్తున్నారు.
కిడ్నీ వ్యాధి సోకినట్టు ముందుగా గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చంటున్నారు. అయితే కిడ్నీ జబ్బును ముందుగా గుర్తించే అద్భుతమైన పరీక్ష వచ్చేసింది. ఇది మన మొబైల్ ఫోన్లోని ఓ యాప్ ద్వారా కావడం విశేషం.
గూగుల్ కంపెనీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ ప్రపంచ వైద్య పరీక్షల రంగంలోనే విప్లవాత్మకమైన మార్పుగా చెపుతున్నారు. ‘స్ట్రీమ్స్’గా పిలిచే ఈ యాప్ను ‘గూగుల్స్ డీప్మైండ్’గాను అభివర్ణిస్తున్నారు. కిడ్నీ రోగిని గుర్తించేందుకు ఈ యాప్ ద్వారా రూ.2 లక్షల కన్నా తక్కువే ఖర్చవుతుంది. ఈ విషయాన్ని ‘నేచర్ డిజిటల్ మెడిసిన్’ పత్రిక తాజా సంచిక వెల్లడించింది.
ఎంత విచిత్రం అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నా టెక్నాలజీ వల్ల రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారట. ఆసుపత్రిలో టెక్నాలజీ ద్వారానే ఓ రోగికి సంబంధించిన సమస్త వివరాలను ఈ యాప్ గుర్తించేస్తుంది. రోగి రక్తంలో ‘క్రియాటినిన్’ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది.