మారుతున్న జీవన శైలీ, ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో కిడ్నిల్లో(మూత్ర పిండాల్లో) రాళ్లు ఏర్పడటం కూడా ఒక సమస్యగా మారింది. ఈ రోజుల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం అనేది అందరినీ వేధిస్తున్న సమస్యగా పరిణమించింది. మన శరీరంలో శోషించుకోకుండా మిగిలిపోయిన ఖనిజ లవణాలు మూత్రంలో రాళ్లుగా ఏర్పడతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ల స్ఫటికాలనే రాళ్లు అంటారు.
ఈ రాళ్లను వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా తొలగించవచ్చు. పరిస్థితులు విషమించినప్పుడు ఆపరేషన్ చేసి తొలగించవచ్చు కూడా, అయితే ఆపరేషన్లకు వేలకు వేలు తగలెయ్యకుండా ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తుంటే కిడ్నీల్లో రాళ్లను నియంత్రించవచ్చు.
కిడ్నీల్లో రాళ్లను తగ్గించేందుకు మీ ఆహారంలో ఈ కింది పదార్థాలను చేర్చుకుంటే మంచిది.
1. నీళ్లు
నీళ్లు ప్రాణికోటికి అత్యవసరం. పైన చెప్పుకున్నట్లు మన శరీరంలో శోషించుకోకుండా మిగిలిపోయిన ఖనిజ లవణాలు మూత్రంలో రాళ్లుగా ఏర్పడతాయి. తగినంత పరిమాణంలో నీళ్లు త్రాగడం ద్వారా మన శరీరం నుంచి ఈ రాళ్లను వెళ్లగొట్టవచ్చు. కిడ్నీల్లో రాళ్లను తగ్గించడానికే గాకుండా మీరు ఫిట్గా ఉండేందుకు కూడా నీళ్లను త్రాగడం మంచిది.
మనం సరైన పరిమాణంలోనే నీళ్లను తాగుతున్నామా లేదా అన్న విషయాన్ని మూత్రం రంగును బట్టి కనుక్కోవచ్చు. మూత్రం ఎలాంటి రంగు లేకుండా ఉన్నట్లయితే సరైన మోతాదులోనే నీళ్లను తాగుతున్నట్లు అర్థం. ఒక వేళ మూత్రం రంగు మారిందంటే నీళ్ల పరిమాణాన్ని పెంచాలన్న మాట.
2. సిట్రస్ జాతి ఫలాలు
కిడ్నీల్లో రాళ్లను కరిగించడానికి సిట్రస్ జాతి ఫలాలు ఎంతగానో తోడ్పడుతాయి. సిట్రిక్ ఆమ్లం మూత్రంలోని కాల్షియంతో బంధం ఏర్పరుచుకొని కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. నిమ్మ వంటి సిట్రస్ పండ్లను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
3. ఆలు గడ్డలు
ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. కాబట్టి ఆలుగడ్డలను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కిడ్నీల్లో రాళ్లు చేరవు.
4. ఉప్పు తగ్గించాలి
కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధ పడేవారు, సమస్య మరింత పెద్దదిగా కాకుండా ఉండాలంటే ఉప్పు ని పరిమితంగా వాడాలి. ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే, మూత్రంలో కాల్షియం పరిమాణామూ తగ్గుతుంది. దీని వల్ల అర్థమైన విషయం ఏంటంటే మూత్రంలో కాల్షియం పరిమాణం పెరిగితే ఆటోమేటిక్గా రాళ్లు ఏర్పడతాయి.
5. ఫ్రక్టోజ్ ఉన్న పదార్థాలను తగ్గించాలి
మీ ఆహారంలో తగినంతగా కార్బోహైడ్రేట్లు ఉన్నట్లయితే, ఫ్రక్జోజ్ పరిమాణం నియంత్రించాలి. ఫ్రక్జోజ్ ప్రకృతి సహజంగా లభించే మూలకం. ఫ్రక్జోజ్ ఉన్న పదార్థాలను అధికంగా తిన్నట్లయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
6. మాంసం
మాంసం వాడకం అధికమయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మాంసంలో జంతు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినా, ఏర్పడకపోయినా జంతు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు.
7. గుడ్లు
గుడ్లలో కూడా జంతు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లున్నా లేదా మొదటి దశలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే
అవకాశమున్నా డాక్డర్లు గుడ్లను తినవద్దని సలహా ఇస్తారు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే ఆ బాధ భయంకరంగా ఉంటుంది.
8. పాలకూర
పాలకూర వంటి ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మంచివి. అయితే కిడ్నీల్లో రాళ్ల విషయంలో మాత్రం ఇది నిజం కాదు. ఎందుకంటే వీటిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమైన ఆక్సలేట్ ఖనిజాలుంటాయి. ఇవి రాళ్లను తగ్గించడం మాట అటుంచి ఇంకా పెంచుతాయి. కాబట్టి కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు పాలకూరకు దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీల్లో రాళ్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం లేదా కొన్ని పదార్థాలను తీసేయడం ద్వారా నయం చేయవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆహార అలవాట్ల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు