వేసవిలో పౌష్టిక పానియాలు
వేసవి వడగాలులకు, వేడిమికి పిల్లలు, పెద్దలు తొందరగా oఅలసిపోతారు. అలాగే పిల్లలకి పరీక్షలు మొదలవుతున్నాయనే ఆందోళన, ఉద్రిక్తత పెరుగుతోంది. వీటన్నింటి నుంచి తప్పించుకొని పిల్లలు ప్రశాంతంగా వుండి బాగా చదవాలంటే ఈ కాలంలో వారి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలి.
- ఈ కాలంలో నూనెపదార్దాలు, వేపుడు కూరలు, మసాలాలు తినడం బాగా తగ్గించాలి.
- తాజా పండ్లు, కూరగాయలు ద్రవపదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి.
- వేసవిలో పగటి సమయం ఎక్కువగా వుండటంతో ఆకలి కూడా బాగానే వుంటుంది. అప్పుడు ఘన పదార్ధాలకన్నా ద్రవపదార్ధాల మీదకే అందరి దృష్టి మళ్ళుతుంది. మంచినీళ్ళతో పొట్ట నింపుకుంటే తర్వాత ఆహారం తినడానికి ఇబ్బంది పడతారు.
- కేవలం దాహం తీరడానికే కాకుండా పోషక విలువలతో కూడిన ద్రవపదార్దాలు పిల్లల చేత తాగించాలి
- దాహమేసినపుడుల్లా బయట కూల్ డ్రింక్స్ ,సోడాలు, రస్నాలు , రోడ్డు పక్కన చేసే పళ్ళ రసాలు తాగకుండా ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్ళు సేవించడం ఉత్తమం
- పోషక విలువలతో కూడిన ద్రవ పదార్దాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
- రాగులపొడి జావలో పాలుకానీ, ఉప్పు, మజ్జిగకానీ కలిపి ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. ఎండ సమయంలో దాన్ని తాగితే వేడి చేయకుండా వుంటుంది. పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది.
- వేసవికాలంలో క్యారెట్ తినడానికి కొంతమంది పిల్లలు ఇష్టపపడరు. అటువంటప్పుడు క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలు చేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలు, చక్కర వేసి జూస్ లా తయారు చేసుకోవచ్చు. దాంట్లో రెండు యాలకుల పొడివేస్తే పిల్లలు మారాం చేయకుండా ఇష్టంగా తాగుతారు.
- ద్రాక్ష, ఖర్బుజా, దోసకాయ, పుచ్చకాయ, సపోటా ఇలా ఈ కాలంలో దొరికే తాజాపళ్ళతో జ్యూస్ చేసీ పిల్లలకు ఇవ్వాలి. మొలకలు వచ్చిన వేరుశనిగ , పెసలు, అలసనందనలను ప్రతిరోజు పిల్లల చేత తినిపిస్తే పౌష్టిక శక్తినిస్తాయి.