ఆఫ్ఘనిస్థాన్ పై ఐరాస ఏమంటోంది. ?
ఆఫ్ఘనిస్థాన్ చోటు చేసుకుంటున్న పరిణామాలు, జరుగుతున్న మార్పులపై ఐక్యరాజ్య సమితి (ఐరాసా) తాజాగా మరోసారి ఓ విజ్ఞప్తిని ప్రపంచ దేశాలకు చేసింది. ప్రతి దేశం కూడా అక్కడి పౌరులకు సహాయంచేయాలని కోరింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ డైరెక్టర్ లలో ఒకరైన ఓమర్ అబ్దీ ఆ దేశంలో పర్యటించిన వచ్చిన తరువాత ఐరాస ఈ విధమైన విజ్ఞప్తిని చేసింది. అఫ్ఘనిస్తాన్ ప్రజలు మానవాళిలో భాగమని పేర్కోంటూ... అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చింది. పోలియో మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమి కొట్టినా .. ఇంకా ఏదో ఒక మూల పోలియో ప్రభావం బైటపడుతోందని మరోసారి తెలిపింది. తమ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో పోలియో మహమ్మారి ఇంకా ఉందని పేర్కోంది. పాకిస్తాన్ కన్నా ఎక్కవ కేసులు ఆఫ్ఘనిస్తాన్ లో నమోదు కావడం చాలా బాధాకరమైన విషయంగా యూనిసెఫ్ పేర్కోంది. మీజిల్స్ టీకా పంపిణీని వేగవంతం చేయాలని అదేశానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ఆఫ్ఘనిస్తాన్ లో సక్రమంగా జరగలేదని పేర్కోంటూ ఈ టీకాను కూడా వెంటనే ప్రజలందరికీ వేయాలని అక్కడి పాలకులకు సూచించినట్లు యూనిసెఫ్ ప్రతినిథి పేర్కోన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో మరికొద్ది నెలల్లో ఆహార సంక్షోభం రానుందని ఐక్య రాజ్య సమితి స్పష్టంగా పేర్కోంది. ఈ విపత్తు రాకముందే ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయాలని కోరింది. ఆ దేశంలో ఆహార నిల్వలు అడుగంటాయని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా లక్షలాది మంది చిన్నారులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. దాదాపు యాభై శాతం మంది ప్రజలు పస్తులతో కాలం గడుపుతున్నారని గణాంకాలతో సహా వివరించింది. వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తో పాటు పరిశుద్ధమైన నీటిని అందించేందుకు మానవ సమాజం ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. లక్షలాది మంది పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు పోషకాహార లోపం తో బాద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే గుట్టలు గుట్టలుగా శవాల్ని చూడాల్సి వచ్చే అవకాశం ఉందని కూడా యూనిసెఫ్ హెచ్చరించింది.