ఈటెలను లవ్ చేసే బ్యాచ్ వస్తే.. సంజయన్న నిర్ణయం ఏందో..?
కొత్తగా చేరే నాయకుల కారణంగా పార్టీలో తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోననే ఆందోళన బీజేపీ రాష్ట్రనాయకత్వంలో ఇప్పటికే ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ బలం పుంజుకుంటేనే అధికారం చేజిక్కించుకోగలమని గుర్తుంచుకోవాలని అధిష్ఠానం హితోపదేశం చేయడంతో చేరికలకు గ్రీన్ సగ్నల్ పడిందట. అయితే ఇవన్నీ ముందుగానే ఊహించిన ఈటెల తనకు ప్రాధాన్యమిచ్చే అంశంలో పార్టీ నుంచి స్పష్టమైన హామీలు తీసుకునేందుకే ఆగినట్టు తెలుస్తోంది. ఈటెల బీసీలపై బలమైన ప్రభావం చూపగలిగిన నేతగా అంచనాలు ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వస్తే ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు నాయకులు బీజేపీలోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా బీసీ నేతే. ఈటెలను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లింది ఆయనే. ముఖ్యమంత్రి కేసీఆర్ను దీటుగా దూకుడుగా ఎదుర్కొంటున్నారన్న గుర్తింపు పార్టీ అధిష్ఠానం వద్ద బండి సంజయ్కు ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఈటెలకు ప్రాధాన్యం పెరిగితే ఆయన ఏమేరకు స్వాగతిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీనుంచి బీజేపీలోకి వచ్చిన డీకే అరుణ తన వర్గం బలాన్ని పెంచుకునేందుకు కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటివారిని పార్టీలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. డీకే అరుణకు ఈటెల రాజేందర్కూ రాజకీయ విభేదాలున్నాయి. అలాగే ఈటెలకూ పెద్దిరెడ్డికీ మధ్య సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో కొత్త నేతల చేరికలతో భవిష్యత్తులో తెలంగాణ బీజేపీలో అధికార కేంద్రాలు, గ్రూపురాజకీయాలు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.