చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

క‌రోనా వైర‌స్ ప్రస్తుతం ప్ర‌పంచాన్ని, మ‌రీ ముఖ్యంగా భార‌త్‌ను అత‌లాకుత‌లం చేస్తున్న మ‌హమ్మారి. ప‌లు దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్నాభిన్నం చేసిన ఈ వైర‌స్ ఎక్క‌డ పుట్టింద‌న్న‌ది ఇప్ప‌టికీ ఇత‌మిద్ధంగా తేల‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు ఇది చైనాలోని ఓ ల్యాబ్ నుంచి పుట్టింద‌నే న‌మ్ముతున్నారు. అయితే చైనాలోని వుహాన్ న‌గ‌రంలోని మాంసాహార మార్కెట్ నుంచి వ్యాపించింద‌ని కొన్నిసార్లు, అస‌లు త‌మ దేశంలోనే ఈ వైర‌స్ పుట్ట‌లేద‌ని, ఇది వేరే దేశాల నుంచి త‌మ దేశానికి సోకింద‌ని మ‌రికొన్నిసార్లు చైనా ప్ర‌భుత్వం చెపుతూ వ‌చ్చింది. అగ్రరాజ్యం అమెరికా స‌హా ప‌లుదేశాలు చైనా వాద‌న‌ను విశ్వ‌సించ‌డం లేదు. అందుకే దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌ర‌పున విచార‌ణ జ‌రిపేలా అమెరికా ప్ర‌భుత్వం వ‌త్తిడి తీసుకువ‌చ్చినా..ఈ విచార‌ణ‌కు అప్ప‌ట్లో చైనా ప్ర‌భుత్వం ఎంత‌మాత్ర‌మూ స‌హ‌క‌రించ‌లేదు. ఇక ఈ అంశాన్నిప‌క్క‌న‌బెట్టి త‌మ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకునేందుకు వ్యాక్సిన్ల త‌యారీ పైనా, వాటి పంపిణీపైనా ఆయా దేశాల ప్ర‌భుత్వాలు దృష్టి పెట్టాయి.

అయితే తాజాగా ఈ వైర‌స్ పుట్టుక‌పై వెల్లడైన సమాచారం విస్తుగొలుపుతోంది. ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌ను తయారుచేసే విషయాన్ని చైనా శాస్త్రవేత్తలు ఆరేళ్ళ క్రితమే చర్చించినట్టు "ది ఆస్ట్రేలియన్" ప్రత్యేక కథనాన్ని వెలువ‌రించింది. ఈ మీడియా సంస్థ‌ వెల్లడించిన తాజా కథనం ఇపుడు ప్రపంచంలో సంచలనంగా మారింది. మూడో ప్రపంచ యుద్ధం జ‌రిగితే గ‌నుక ఆ యుద్ధంలో జీవాయుధాలే ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌ని చైనా న‌మ్ముతోంద‌ని, ఆ దిశ‌గా ఆ దేశ‌ శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప్ర‌యోగాలు కొన్నేళ్ల క్రిత‌మే మొద‌లుపెట్టిన‌ట్టు ఆ క‌థ‌నం వెల్ల‌డించింది. సార్స్, కరోనా లాంటి అత్యంత  ప్ర‌మాద‌క‌ర‌ వైరస్ ల‌ను కృత్రిమంగా త‌యారు చేసి, మనుషుల్లోకి వీటిని చొప్పించి ఆయుధాలుగా మలుచుకోవచ్చనే అభిప్రాయానికి వ‌చ్చిన చైనా శాస్త్రజ్ఞులు, వైద్యాధికారులు ప్రత్యేకంగా పరిశోధన పేపర్లనే సబ్మిట్ చేశారట. జీవాయుధాలతో దాడిచేస్తే శతృదేశాల వైద్య ర‌క్ష‌ణ‌ వ్యవస్ధలు మొత్తం కుప్పుకూలుతాయ‌ని, అవి ఆర్థికంగా కూడా కోలుకోలేని స్థాయిలో దెబ్బ‌తింటాయ‌ని చైనా  అంచనా వేసిందట. వాస్తవానికి క‌రోనా వైరస్ తొలిసారిగా బ‌య‌ట‌ప‌డింది 2019లో. దానికి ఐదేళ్ళ క్రితమే సార్స్, కరోనా లాంటి వైరస్ లతో ఆయుధాలను తయారు చేసే విషయంపై శాస్త్రవేత్తలు, వైద్యాధికారుల మధ్య చర్చలు జరిగాయంటే ఇప్ప‌టిదాకా చైనాపై ప్ర‌పంచం వ్య‌క్త చేస్తున్న అనుమానాలు వాస్త‌వ‌మేన‌న్న‌ విశ్లేష‌ణలు  ప్ర‌పంచవ్యాప్తంగా వెలువ‌డుతున్నాయి. డ్రాగన్ పాలకుల దుష్టపన్నాగాలపై మ‌రోసారి ప్రపంచంలో చర్చ మొదలైంది.

నిజానికి గ‌డ‌చిన నాలుగు ద‌శాబ్దాలుగా చైనా సాధించిన‌ ఆర్థిక ప్ర‌గ‌తి అనిత‌ర సాధ్యం. క‌మ్యూనిస్టు దేశంగా ఉన్నా..త‌మ దేశానికి అనువైన‌, అనుకూల‌మైన సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం ద్వారా పాశ్చ్యాత్త దేశాల నుంచి పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌డంతోపాటు, చౌక శ్రామిక శ‌క్తిని ఆధారం చేసుకుని త‌యారీ రంగానికి ప్ర‌పంచ కేంద్రంగా ఎదిగింది. ఆసియాలో ప్ర‌బ‌ల ఆర్థిక శ‌క్తిగా ఉన్న జ‌పాన్‌ను సైతం వెన‌కకు నెట్టి ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది. అయితే ఇరుగుపొరుగు దేశాల‌ను క‌బ‌ళించే విస్త‌ర‌ణవాదంతోపాటు, దౌత్య‌రంగంలో అనుస‌రిస్తున్న‌ దుందుడుకు వైఖ‌రి చైనా ప్ర‌తిష్ఠ‌ను ఇప్ప‌టికే పలుచ‌న చేశాయి..ఇప్పుడు ఈ జీవాయుధాల అంశం చైనా ప‌రువును మ‌రింత‌గా దెబ్బ‌తీయ‌డం ఖాయ‌మ‌ని, చైనా జీవాయుధాల‌తో మూడో ప్ర‌పంచ యుద్దాన్ని మొద‌లుపెట్టిన‌ట్టుగానే భావించాల‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: