హెరాల్డ్ ఎడిటోరియల్ : మళ్ళీ నిమ్మగడ్డ రెడీ అయిపోతున్నారా ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్యే మొదలుకానపుడు దాన్నే బూచిగా చూపించి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసేశారు ఏకపక్షంగా. ఇపుడు రోజుకు వేల కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలను నిర్వహించేందుకు తాము రెడీ అంటున్నారు. అంటే అప్పుడూ, ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే నిమ్మగడ్డ ధ్యేయంగా పెట్టుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇటువంటి కారణాల వల్లే నిమ్మగడ్డను వెనుకనుండి చంద్రబాబునాయుడు నడిపిస్తున్నారంటు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నది. మామూలుగా ఎక్కడైనా ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందన్నది తెలిసిందే. కానీ ఏపిలో మాత్రం ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటోంది. ఈ కారణంగానే ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు పెద్ద గొడవైపోయింది. చివరకు కోర్టు జోక్యంతో సద్దుమణిగినట్లు అనిపించినా నిప్పు ఇంకా పూర్తిగా చల్లారలేదని అర్ధమవుతోంది.
ఎన్నికల నిర్వహణపై 28వ తేదీన రాజకీయపార్టీలతో సమావేశం పెడుతున్నట్లు నిమ్మగడ్డ ప్రభుత్వానికి చెప్పాడో లేదో తెలీదు. ఎందుకంటే కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టంగా కోర్టుకే చెప్పేసింది. ప్రస్తుత పరిస్ధితులను నిమ్మగడ్డ గనుక ప్రభుత్వంతో చర్చించుంటే కరోనా వైరస్ విషయం కచ్చితంగా ఉన్నతాధికారులు నిమ్మగడ్డకు చెప్పే ఉంటారు. అప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నిమ్మగడ్డ కూడా కోర్టుకు చెప్పుండేవారే. కానీ అలాకాకుండా ఎన్నికల నిర్వహణపై రాజకీయా పార్టీల అభిప్రాయాన్ని కోరుతున్నారంటే ఏమిటర్ధం ? సమావేశంలో పాల్గొనే పార్టీల్లో వైసీపీ ఎటూ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తుంది. వైసీపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి మిగిలిన పార్టీలన్నీ ఎన్నికలు జరిపించాల్సిందే అని పట్టుబడతాయనే ప్రచారం మొదలైపోయింది. మరి ఈ పరిస్ధితుల్లో బీజేపీ ఏమి చేస్తుందనేది కీలకమైంది.