హెరాల్డ్డ్ ఎడిటోరియల్ : న్యాయవ్యవస్ధ మీద జగన్ ఫిర్యాదుకు కారణం ఇదేనా ?

Vijaya
మొత్తం ఎల్లోబ్యాచ్ అంతా జగన్ తనమీదున్న కేసుల విషయంలో బ్లాక్ మెయిల్ చేయటం కోసమే న్యాయవ్యవస్ధను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నట్లుగా నానా యాగీ చేస్తొంది. తన కేసుల నుండి తప్పించుకోవటం కోసమో లేకపోతే విచారణ జరగకుండా అడ్డుపడటం కోసమే న్యాయవ్యవస్ధపై జగన్ ఎదురుదాడికి దిగాడంటూ చంద్రబాబునాయుడు,  ఎల్లోమీడియా మూడు రోజులుగా ఒకటే గోల చేస్తున్న విషయం  అందరు చేస్తున్నదే. విషయం లోతుల్లోకి వెళ్ళి చూసినపుడు ఎల్లోబ్యాచ్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులపై రోజువారి విచారణ జరపాలని సుప్రింకోర్టే ఆదేశించిన తర్వాత జగన్ తల్లక్రిందులుగా తపస్సు చేసినా ఆపటం సాధ్యంకాదు. ఇంతచిన్న విషయం కూడా తెలుసుకోలేనంత తెలివి తక్కువవాడో లేకపోతే  అమాయకుడు కాదు జగన్.




మరి న్యాయవ్యవస్ధ మీద ఫిర్యాదులు చేయాలనేంత డేరింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు ?  అదికూడా ఎవరో అనామకులు మీద కాదు ఫిర్యాదు చేసింది. ప్రస్తుత సుప్రింకోర్టు జస్టిస్, తొందరలోనే చీఫ్ జస్టిస్ అవుతారని అనుకుంటున్న ఎన్వీ రమణ మీద. రమణతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి+మరో ఆరుగుగు జడ్జీల మీద ఫిర్యాదులు చేయటమంటే మామూలు విషయం కాదు.  చంద్రబాబు, దమ్మాలపాటి మీద చేసేవి రాజకీయ విమర్శలే అనుకున్నా న్యాయవ్యవస్ధలోని ప్రముఖుల మీద నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే కుదరదు. అందుకనే పక్కాడా, ఆధారాలతో సహా జగన్ ఆరోపణలు చేశాడు. వాళ్ళందరిపైన అసలు ఆరోపణలు చేయాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చింది అన్నదే అసలైన ప్రశ్న.




ముందే ఎల్లోమీడియా బురద చల్లుతున్న ప్రకారం తనపైన విచారణ జరుగుతున్న కేసుల నుండి తప్పించుకోవటానికైతే మాత్రం కాదు.  ఇక్కడ గమించాల్సిన విషయం ఏమిటంటే  జగన్ పై నమోదైన కేసులు సంవత్సరాల తరబడి కోర్టుల్లో విచారణలు జరుగుతున్నా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫైనల్ కాలేదు. పైగా జగన్ కేసుల్లో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారుల్లో చాలామందిపైన నమోదైన కేసుల్లో ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలను విచారించిన కోర్టులు వాళ్ళపైన కూడా సరైన ఆధారాలు లేవని నిర్ధారించింది. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్  పై సీబీఐ పెట్టిన క్విడ్ ప్రోకో కేసును కోర్టు కొట్టేసింది. ఇలాంటి కేసుల్లోనే మరికొందరిపైన కేసులను ఎత్తేసింది. విచారణ జరిపినంతలో క్విడ్ ప్రో కో జరిగినట్లు సీబీఐ సాక్ష్యాలను చూపలేకపోయిందని కోర్టు గతంలోనే అభిప్రాయపడింది.




జగన్ మీదున్న కేసుల్లో ఇటు ఐఏఎస్ అధికారులపైనా సాక్ష్యాలు లేవని, ఇటు పారిశ్రిమకవేత్తలు, వ్యాపారవేత్తలు క్విడ్ ప్రో కో కు పాల్పడినట్లు సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడితే ఇక జగన్ అవినీతికి పాల్పడిందెక్కడ ? పైగా కేసులు నమోదు చేసేనాటికి జగన్ కు ప్రభుత్వంలో ఎటువంటి హోదా కూడా లేదు. అంటే ప్రభుత్వాన్ని జగన్  ప్రభావితం చేశాడనేందుకు కూడా ఆధారాలు లేనట్లే. కాబట్టి తనపై ఉన్న కేసులన్నీ అక్రమంగా రాజకీయ దురుద్దేశ్యాలతో పెట్టినవే అన్న జగన్ వాదన మెల్లిగా అయినా నిరూపణవుతుందేమో. కాబట్టి ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వల్ల తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జగన్ కు బాగా తెలుసు. కాకపోతే ఏదో రూపంలో తనపై నమోదైన కేసులను తిరిగతోడి మళ్ళీ ఏదో విధంగా బెయిల్ రద్దు చేసి ఇబ్బందులు పెడతారని జగన్ అనుమానిస్తున్నట్లు ఉంది. ఆ అవకాశం ప్రత్యర్ధులకు ఇవ్వకూడదనే తానే ముందుగా చొరవ తీసుకుని ప్రత్యర్ధులకు మద్దతుగా నిలబడుతున్న వాళ్ళపై ఫిర్యాదులు చేశాడు.




పైగా అప్పట్లో తనను రాజకీయ కారణాలతో కేసుల్లో ఇరికించినట్లు కాకుండా ఇన్ సైడ్ ట్రేడింగ్, ప్రభుత్వ వ్యతిరేక వైఖరి అనే ఆరోపణలతో  పక్కా ఆధారాలతో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుపై బాబ్డే స్పందిస్తే మంచిదే. ఒకవేళ స్పందించకపోతే ఏమి చేయాలో తెలియనంత అమాయకుడు కాడు జగన్. ఎప్పుడేమి చేయాలో బాగా తెలిసు కాబట్టి అవసరానికి తగ్గట్లే యాక్ట్ చేస్తాడు. ఎందుకంటే తన ఫిర్యాదులకు లాజికల్ ఎండ్ తీసుకు వచ్చేందుకు జగన్ కు చాలా వేదికలే ఉన్నాయి. జగన్ విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకు కూడా ఆ విషయం బాగా తెలుసు. అందుకనే ఫిర్యాదుపై ఇంతగా గగ్గోలు పెట్టేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: