హెరాల్డ్ఎడిటోరియల్: డిక్లరేషన్ ’అసలు’ ఎజెండాను బయటపెట్టిన ఎల్లోమీడియా..చంద్రబాబుకు షాక్
సరే నిబంధన అయితే ఉంది కానీ డిక్లరేషన్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు లేనివాళ్ళు లేదు. డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు తాము ఎందుకు డిక్లరేషన్ ఇచ్చామనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. అలాగే డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి డిక్లరేషన్ విషయం ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. అయితే డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను జగన్ పట్టించుకోకపోవటం అభ్యంతరంగా కనిపిస్తుందని ఎల్లోమీడియా చెప్పింది. ఇదే సమయంలో అసలు జగన్ డిక్లరేషన్ ఇచ్చే విషయం ఇపుడే ఎందుకింత వివాదాస్పదమైంది ? అని కూడా అనుమానాన్ని బయటపెట్టింది. గతంలో ఎన్నడూ జగన్ విషయంలో రాని డిక్లరేషన్ వివాదం ఇపుడే ఎందుకింతగా రాజుకుంది ? అని కూడా తన చెత్తపలుకులో ఎల్లోమీడియా ప్రశ్నించింది.
దానికి సమాధానం కూడా ఇచ్చింది లేండి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా అప్పుడు అడగని విషయాన్ని గుర్తుచేసింది. అలాంటిది ఇపుడు జగన్ విషయంలో మాత్రమే డిక్లరేషన్ వివాదం తెరమీదకు రావటంతో మత రాజకీయాలకు బీజం పడిందని అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుమల ఆలయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పదే పదే డిమాండ్ చేసింది చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా మాత్రమే. బిజెపి స్ధానిక నేత కూడా ఇదే డిమాండ్ చేసినా ఆయన డిమాండ్ తో తమకు సంబంధం లేదని పార్టీ అప్పుడే ప్రకటించేసింది. దాన్ని ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతోంది.
మత రాజకీయాలకు భీజం వేయటంలో భాగంగానే జగన్ విషయంలో డిక్లరేషన్ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబే అన్న విషయాన్ని ఎల్లోమీడియా బయటపెట్టింది. ఎందుకంటే జగన్ తిరుమలకు వెళ్ళే నాలుగు రోజుల ముందు నుండి చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే డిమాండ్ చేశారు. తిరుమలకు చేరుకునే రోజు కూడా చిత్తూరు జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ డిక్లరేషన్ విషయంలో జగన్ను ఒత్తిడి చేయాలంటూ బాగా రెచ్చగొట్టారు. అయితే చంద్రబాబు మాటలను తమ్ముళ్ళెవరు పట్టించుకోలేదులేండి అది వేరే సంగతి. కొద్ది రోజులుగా ఎన్నిలేని విధంగా చంద్రబాబు హిందుత్వం గురించి, హిందుమతం గురించి పదే పదే మాట్లాడుతున్నారు.