పోలవరంపై బాబువి మాటలు.. జగన్వి చేతలు.. ఈ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాకే..!
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఐదేళ్ల పాటు చంద్రబాబు మాటలు చెపుతూ ఫొటోలు తీయించుకుని తన అనుకూల మీడియాలో హైలెట్ చేయించుకుంటూ కాలం గడిపేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన యేడాదిలోనే పక్కా ప్లానింగ్తో పోలవరం పూర్తి చేసేలా ముందుకు వెళుతున్నారు. 2022 నాటికి పోలవరం పూర్తి చేసేలా ముందుకు వెళుతోన్న జగన్ గురువారం మరోసారి పోలవరంపై సమీక్ష జరపడంతో పాటు పోలవరం విషయంలో మైండ్ బ్లాక్ అయ్యే ప్లానింగ్తో ఉన్నారు. ఈ సమీక్ష ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఆగస్టు తప్ప మిగిలిన సమయాల్లో స్పిల్వే పనులు నడిచేలా ప్రణాళిక వేసుకున్నారు. అలాగే రేడియల్ గేట్స్ ఫ్రాబ్రికేషన్ చేసుకుని నవంబరు నుంచి అమర్చుతారు. ఇక మిగిలిన వాటి పనులు కూడా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ఏప్రిల్లో 3 వేల మంది కూలీలు ఉంటే.. కోవిడ్ కారణంగా 900 మంది మాత్రమే పనుల్లో ఉన్నారని, మళ్లీ వారందర్నీ పిలిపిస్తున్నామని, ప్రస్తుతం 2 వేల మంది కూలీలు పని చేస్తున్నారని అధికారులు చెప్పారు.
ఇక స్పిల్వేలో 52 పిల్లర్లు గతంలో సరాసరిన 28 మీటర్లు ఎత్తున ఉంటే.. ప్రస్తుతం 47.44 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాయి. ఇక వర్షపు నీరు వచ్చే సమయంలో కూడా చేసుకోదగ్గ పనులు చేసుకోవాలన్న సీఎం, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పిల్ వే పూర్తయిన తర్వాత గేట్లను నవంబరు నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి, ఆలోగా గేట్ల ఫాబ్రికేషన్ అయ్యేలా చేయనున్నారు. అలాగే ప్లాన్–బి కూడా పెట్టుకోవాలని జగన్ సూచించారు. నవంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. పనులు ప్రణాళికా బద్ధంగా సాగకపోతే.. షెడ్యూల్కు అంతరాయం ఏర్పడుతుందని సీఎం చెప్పారు.
ఇక గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 41.5 మీటర్ల ఎత్తు వరకూ ప్రస్తుతం ముంపు ప్రమాదం ఉన్న వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ఇక చెల్లింపులు పోగా, పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నసీఎం అధికారులను ఆదేశించారు. మరి ఈ ప్లానింగ్ చూస్తే జగన్ పోలవరం విషయంలో చంద్రబాబులా హడావిడి లేకుండా పనులు పూర్తి చేసి సమాధానం చెప్పాలన్న పక్కా ప్లానింగ్తో ఉన్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.