ఆర్యన్ కేసులో ‘మిస్టరీ మ్యాన్’ అరెస్ట్
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న కిరణ్ గోస్వామిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని క్రూయిజ్ పై ఎన్సీబీ దాడుల తర్వాత గోస్వామి ఆర్యన్ ఖాన్ తో తీసుకున్న సెల్ఫీ వైరల్ అయింది. తమ ఏజెంట్లలో కిరణ్ గోస్వామి ఒకరని ఎన్సీబీ చెప్పుకొచ్చింది. అయితే అతనిపై 2018లో ఒక ఫ్రాడ్ కేసు కూడా నమోదైనట్టు సమాచారం. ఈ కేసు విషయంలో ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. అదేవిధంగా కిరణ్ పై లుకౌట్ నోటీసు కూడా ఉన్నది. ఈ తరుణంలోనే తాజాగా ఫూణె పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ తర్వాత.. అదే షిప్ లో అతడితోపాటు సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోస్వామి కనిపించకుండా మాయమై పోయాడు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి ఎన్సీబీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇలాంటి సమయంలో ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి తాను లొంగిపోతానని స్టేట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక కిరణ్ గోస్వామి ఎన్సీబీ అధికారులకు రూ.25 కోట్ల లంచం ఇవ్వాలని పలువురికి చెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో తాను లొంగిపోతానని కిరణ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్యన్ తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ ఈ కేసు క్లోజ్ చేయడానికి ఎన్సీబీ అధికారులకు రూ.25 కోట్లు లంచం ఇస్తానని, ఇక ఇంతటితో ఈ కేసు ముగిసిపోతుందని పలువురికి చెప్పాడని ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను మాత్రం కిరణ్ ఖండించారు. తాజాగా కిరణ్ అరెస్ట్ తో ఈ కేసు కొత్త మలుపు తిరిగినది.