వామ్మో.. ప్రియురాలికి గంజాయి గిఫ్ట్ ఇచ్చిన యువకుడు.. చివరికి?
ఇక మరి కొంతమంది ఏకంగా తమ ప్రేమను నిరాకరించిన అమ్మాయిలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమను నిరాకరించిన యువతి పై కక్ష పెంచుకున్నాడు సదరు యువకుడు. ఈ క్రమంలోనే బహుమతి పేరుతో గంజాయి ప్యాకెట్ ఇచ్చాడు. చివరికి కటకటాలపాలయ్యాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్టణానికి చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే తనతో పాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడ్డాడు. కానీ తనకు ఇష్టం లేదు అంటూ యువతి సున్నితంగా తిరస్కరించింది. దీంతో యువతి పై కక్ష పెంచుకున్నాడు
ఈవెంట్స్ నిర్వాహకురాలిగా పనిచేస్తూ ఉంటుంది సదరు యువతి. ఈ క్రమంలోనే ఇటీవల షిరిడి సాయి ఎక్స్ ప్రెస్లో సికింద్రాబాద్ బయలుదేరింది ఆ యువతి. ఇక ఆ యువతి దగ్గరకు చేరుకుని యువకుడు తమ స్నేహానికి గుర్తుగా బహుమతి అంటూ నమ్మించి మూడు కిలోల గంజాయి ప్యాకెట్ ప్యాక్ చేసి చేతికిచ్చాడు. అంతేకాదు గంజాయి తరలిస్తున్నారు అధికారులకు సమాచారం కూడా ఇచ్చాడు. మరుసటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోగానే అధికారులు తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో యువతి షాక్ అయింది. ఇక ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఇక ఈ విచారణలో ఇదంతా చేసింది యువకుడు అన్న విషయం బయటపడింది. ఇక ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో యువతిని వదిలిపెట్టి అదే రోజు వినయ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.