ప్రేమ.. వివాహం.. కష్టపడి ఉద్యోగం.. అంతలోనే విషాదం..!
ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సంతోషంతో తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఆంధ్రప్రదేశ్లోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావు, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ తరుణంలో వారి కుటుంబం గడవడానికి వారు ఆ పని ఈ పని చేసుకుంటూ గడిపారు. సావిత్రి మాత్రం కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
మహబూబ్నగర్లోని విద్యుత్శాఖ జూనియర్ లైన్మెన్గా సావిత్రి ఉద్యోగం సంపాదించింది. ఆమె తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్నగర్ వెళ్లి విద్యుత్శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. దసరా పండుగ కోసం సొంత ఊరికి తిరిగివస్తుండగా తెల్లవారుజామున నందిగామ-రామన్నపేట రోడ్డు వద్ద వీరి బైకు రహదారి పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొట్టింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇద్దరు కిందపడిపోయారు. వెనుక కూర్చున్న సావిత్రి రైలింగ్కు తాకింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్ప్రతిలో చికిత్స పొందిన కొద్ది సేపటికే ఆమె మరణించింది. తీవ్రంగా గాయపడిన మారుతీరావు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్టుండి ఇలా ప్రమాదం జరగడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కలిసిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి.