చోరీ కేసులో అడ్డంగా బుక్కైన పోలీసు అధికారి..??
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో వ్యానులో దుస్తుల అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఆ దుకాణాన్ని రాత్రి మూసేసి మరుసటి రోజు తెరిచి వ్యాపారం చేస్తుండేవాడు. అయితే నాలుగు రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్ డ్రెస్లో ఉన్న మరో కానిస్టేబుల్ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిళ్ల బట్టలను దొంగతనం చేశాడు. ఇక మరుసటి రోజు ఆ వ్యక్తి వచ్చిచూసేసరికి.. మూటలో దుస్తులు తక్కువగా ఉండటాన్ని గ్రహించాడు.
ఈ నేపథ్యంలోనే తన దుకాణం నుండి ఎవరో దుస్తులను దొంగిలించారనే అనుమానంతో అక్కడి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేశాడు. దాంతో అసలు దొంగ దొరికాడు. అయితే సీసీ ఫుటేజీని చూడటంతో చోరీ చేసిన వ్యక్తి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అని తెలిసిపోయింది. దాంతో బాధితుడి ధైర్యంతో ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగగా మారిన పోలీసు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దొంగతనంలో బైక్పై వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కోణంలోనే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు.. ఈ దోపిడికి పాల్పడిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో జిల్లా పోలీస్ ఉన్నట్లు తెలుస్తోంది.