కొత్త వ్యాపారంలోకి టీటీడీ..!

Podili Ravindranath
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. వేల సంఖ్యలో భక్తులు, కోట్ల రూపాయల్లో కానుకలు... ఇదే శ్రీనివాసుని వైభోగానికి తార్కాణం కూడా. ధార్మిక సంస్థగా పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానం... ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది కూడా. అలాగే స్వామి వారి కానుకలను ధార్మిక కార్యక్రమాలకు కూడా వినియోగిస్తోంది. ఊరూరా కల్యాణ మండపాలు నిర్మించి... భక్తులకు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది కూడా. అటు బుక్ స్టాల్ రూపంలో కూడా ఎన్నో వేల గ్రంధాలను భక్తుల కోసం ముద్రించింది కూడా. ఇక శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ధార్మిక కార్యక్రమాలను వివిధ భాషల్లో ప్రజలకు అందిస్తోంది. ఇప్పుడు మరో కొత్త వ్యాపారం వైపు టీటీడీ అడుగులు వేస్తోంది.
తిరుమల గిరులపై ఎన్నో రకాల సుగంధ పుష్పాలు ప్రతిరోజు వికసిస్తూ ఉంటాయి. అటు నారాయణ వనం మొదలు... ఎన్నో చోట్ల టీటీడీ ప్రత్యేక నర్సరీలను మెయిటెయిన్ చేస్తోంది. నిత్యం... వేల రకాల పూలు ఈ వనాల్లో వికసిస్తూ ఉంటాయి. వాటిలో సగం వరకు స్వామి వారికి నిత్యం ఉపయోగిస్తారు. రకరకాల సేవలకు కూడా స్వామి వారికి పూలను వినియోగిస్తుంటారు. వాటిని ఆ తర్వాత తీసేస్తారు. ఇకపై వాటి నుంచి సరికొత్త వ్యాపారం చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే అగరబత్తీల వ్యాపారం.
ఇప్పటికే ఈ విషయంపై అన్ని చర్యలు పూర్తి చేసిన టీటీడీ... ఈ నెల 13వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తీలను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. సప్తగిరుల గుర్తుగా మొత్తం ఏడు రకాల అగరబత్తీలను తీసుకువస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ముందుగా వీటిని తిరుమలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత అన్ని కల్యాణ మండపాల్లో ప్రజల కోసం అందుబాటులో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది. స్వామి వారి సుగంధం ఇకపై ప్రతి ఇంట్లో రానుంది. గోవిందా గోవింద.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: