హైదరాబాద్లో హాస్టళ్లకు మళ్లీ కళ వచ్చేనా?
అద్దె భవనంలో హాస్టళ్లను నిర్వహించేవారు కిరాయి కట్టలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ మందితో హాస్టల్స్ను నడపలేకపోతున్నారు.ప్రైవేట్ హాస్టల్, పెయిడ్ గెస్ట్ హోమ్ నడపాలంటే నెలకు ఏరియాను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకు అద్దె కట్టాల్సి ఉంటుంది. కమర్షియల్ ఏరియాల్లో హాస్టళ్లను దృష్టిలో పెట్టుకునే నాలుగైదు అంతస్తుల బిల్డింగులను కడుతుంటారు. ఆయా ప్రాంతాల్లో అద్దెలు కూడా లక్షల్లో ఉంటాయి. ప్రైవేటు హాస్టల్లో ఉండేవారి నుంచి నిర్వా హకులు నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఫీజుగా తీసుకుంటారు. కొవిడ్ ఎంట్రీ తర్వాత ప్రైవేటు హాస్టళ్ల పరిస్థితి తారుమారైంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు.
కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఐసోలేషన్ సెంటర్లుగా వాడుకునేందుకు కొందరు హాస్టళ్లను అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత అద్దెలు కట్టలేక ఓనర్లతో నిర్వాహకులకు గొడవలు తప్పడం లేదు. అద్దె కోసం యజమానులు ఒత్తిడి పెంచుతున్నారని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. అద్దె విషయంలో ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు . కరోనాకు ముందు ఒక్కో హాస్టల్లో 100 మందికి పైగానే ఉండేవారు. ప్రస్తుతం 20 నుంచి 30 మంది కూడా ఉండటం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ట్యాక్సుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.