తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ముంచుకురానున్న ముప్పు..?

FARMANULLA SHAIK
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది.ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇటు ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలావుండగా కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు మరోసారి వణుకుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 70నుంచి 170మి.మీ వర్షపాతం నమోదైంది. మున్నేరుకు మరోసారి వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖమ్మం మునిగిపోయే ప్రమాదం వుంది.ఇటు ఏపీ లో ప.గో,విజయవాడ లో వర్షం దంచికొడుతుంది.ప్రకాశం బ్యారేజి కి వరద ప్రవాహం పెరుగుతుంది.
ఆదివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 

విజయవాడ నగరంలో మరోసారి భారీవర్షం కురిసింది. సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే రూట్లో ఇంకా నీళ్లున్నాయి. కృష్ణా జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకు వానలు తెరిపివ్వకపోవచ్చని హెచ్చరించింది. హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్, సికింద్రాబాద్‌, అబిడ్స్, కోఠి, ఉప్పల్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఐఎండీ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కోలుకోలేని దెబ్బతీశాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: