నైరుతి పశ్చిమ బంగాళాఖాతం సమీపంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో నవంబర్ 09న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెల్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసినదే. ఈనెల 9న ఉపరితల ఆవర్తన ప్రభావంతో బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.