హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకు రైతుల సెగ తాకినది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల ఆయన దీపావళి పర్వదినాన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతులను ఏ పని లేని తాగుబోతులని విమర్శలు చేశారు. దీంతో బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్త పరిచారు. హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చిన ఎంపీ జాంగ్రాను అడ్డుకున్నారు రైతులు.
రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో పోలీసులు భారీగానే మోహరించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆగ్రహం చెందిన ఆందోళనకారులు బీజేపీ ఎంపీ రామ్చందర్ జాంగ్రా కారు అద్దాన్ని ధ్వంసం చేసారు. పోలీసులు కొంత మంది రైతులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు.