హెరాయిన్ వెనక బిగ్బాస్ ఎవరు?
ఏపీని అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మార్చారని తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.9 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ అఫ్ఘానిస్తాన్ నుంచి విజయవాడకు దిగుమతి అయ్యిందని, ఆశి ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుందని నరేంద్ర వెల్లడించారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో హెరాయిన్ పట్టుకున్న ఘటన ఇదేనని, తాలిబన్ టు తాడేపల్లికి ఉన్న సంబంధమేంటో బయటకు రావాల్సి ఉందన్నారు. దీని వెనుకున్న బిగ్బాస్ ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని నరేంద్ర డిమాండ్ చేశారు. అక్రమాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత పెద్దస్థాయిలో మాదకద్రవ్యాల సరఫరాకు అసలు సహకరించింది ఎవరు? వారి వెనక ఎవరున్నారు? ఇత్యాది విషయాలన్నీ బయటకు రావాలన్నారు. నేర చరిత్ర ఉన్నవారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉన్నారని, తితిదేను రాజకీయ వేదికగా మారుస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయకుండా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు.