కరోనా కేసులు మరింత పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. వడోదర, రాజ్కోట్ ,అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో ఇప్పటికే అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 9.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలవుతాయి. గతంలో విధించిన నైట్ కర్ఫ్యూ గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతోమరో 15 రోజులు పొడిగిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గుజరాత్లో గడిచిన 24 గంటల్లో 2,200 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,338కి చేరింది. మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించడంతో మృతుల సంఖ్య 4,510కి చేరింది. గుజరాత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 53,89,349 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో 6,43,855 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. కర్ఫ్యూ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికప్పుడు లాక్డౌన్ విధించే యోచనేదీ లేదని వెల్లడించింది.