తెలంగాణలో కరోనా మరణ మృదంగం... పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కరోనాతో పోరాడుతూ నిన్న రాత్రి మృతి చెందారు. నగరంలోని వనస్థలిపురంలో నివశిస్తున్న దయాకర్ పాతబస్తీలోని ఓ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించారు.
ఆదివారం ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా కరోనా నిర్ధారణ అయింది. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అతను మృతిచెందారు. సీనియర్ పోలీస్ అధికారి ఒకరు దయార్ మృతిని ధ్రువీకరించారు. దయాకర్ తో సన్నిహితంగా మెలిగిన 16 మంది పోలీసుల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. అధికారులు నలుగురిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి దయాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దయాకర్ మృతితో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 41కు చేరింది.