మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్

N.Hari
తెలంగాణలో మహిళలు, పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్‌పై మహిళా భద్రతా విభాగం అడిషనల్ డి.జి. స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధన కేంద్రం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై  డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే మహిళలు, పిల్లలు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఇప్పటికే సమాజంలోని భిన్నవర్గాల భాగస్వామ్యంతో మహిళా భద్రత విభాగం ద్వారా పలు చర్యలను చేపట్టడం జరిగిందని అన్నారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు సాధ్యమవుతుందని, ఇందుకుగాను సైబర్ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, సైబర్ నేరాలను పరిష్కరించేందుకు ఈ సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని తెలియజేశారు.

 
సైబర్ నేరాలపై స్థానికంగానే ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించేందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. కొవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతి కేసులో  సైబర్ పాత్ర ఉందని వెల్లడించారు. నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులతో ఏర్పాటుచేసిన ఈ సైబర్ ల్యాబ్ తో సైబర్ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఏర్పడుతుందని డీజీపీ వెల్లడించారు.  


2020-21 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ సంబంధిత నేరాల పరిష్కారం, నియంత్రణకు సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి. స్వాతిలక్రా పేర్కొన్నారు. ఆర్ అండ్ డి సెంటర్ లాగా పనిచేసే ఈ ల్యాబ్ లో నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఐటీ సంబంధిత సాంకేతిక అంశాలను సీఆర్‌సీఐడీఎఫ్‌ అందిస్తుందని డీఐజీ సుమతి వెల్లడించారు. సైబర్ ఆధారిత వేధింపులు, గృహహింస , ఎన్నారై కేసులు, మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర అంశాలపై ఈ సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: