మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్
సైబర్ నేరాలపై స్థానికంగానే ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించేందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని డీజీపీ మహేందర్రెడ్డి వివరించారు. కొవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతి కేసులో సైబర్ పాత్ర ఉందని వెల్లడించారు. నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులతో ఏర్పాటుచేసిన ఈ సైబర్ ల్యాబ్ తో సైబర్ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఏర్పడుతుందని డీజీపీ వెల్లడించారు.
2020-21 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ సంబంధిత నేరాల పరిష్కారం, నియంత్రణకు సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి. స్వాతిలక్రా పేర్కొన్నారు. ఆర్ అండ్ డి సెంటర్ లాగా పనిచేసే ఈ ల్యాబ్ లో నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఐటీ సంబంధిత సాంకేతిక అంశాలను సీఆర్సీఐడీఎఫ్ అందిస్తుందని డీఐజీ సుమతి వెల్లడించారు. సైబర్ ఆధారిత వేధింపులు, గృహహింస , ఎన్నారై కేసులు, మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర అంశాలపై ఈ సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని ఆమె తెలిపారు.